ట్రంప్ నిర్ణయం... భారతీయులకు శుభవార్త....
posted on Jan 31, 2018 11:10AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం భారతీయులకు మంచి ఊరట కలిగించే విధంగా ఉంది. ప్రతిభ ఆధారంగానే ప్రవేశం కల్పించాలని ట్రంప్ ప్రకటన చేశారు. కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ... విబేధాలను పక్కన పెడుతూ అందరూ ఐకమత్యంతో ఉండాలని సూచించారు. అంతేకాదు...'అమెరికాలో శాశ్వత పౌరసభ్యత్వం ఇచ్చేందుకు అందించే గ్రీన్ కార్డులను ప్రతిభ ఆధారంగానే ఇవ్వాలని... అలా చేయడం ద్వారా మాత్రమే అమెరికాను ప్రథమ స్థానంలో ఉంచగలమని అన్నారు. మెరిట్ ఆధారిత వలస విధానం ప్రారంభించడానికి ఇదే సమయం. ఎవరైతే అధిక నైపుణ్యాలు కలిగి ఉన్నారో, ఎవరు మన సమాజానికి మంచి సేవలను అందించగలరో, ఎవరు మన దేశాన్ని ప్రేమించి గౌరవిస్తారో వారికి మాత్రమే మనం గ్రీన్ కార్డులు ఇవ్వాలి' అని ట్రంప్ చెప్పారు. అలాగే, లాటరీ వీసా వ్యవస్థకు తాను ముగింపు పలకబోతున్నానని మరోసారి స్పష్టం చేశారు. దీంతో...మెరిట్ ఆధారిత వలస వ్యవస్థను ట్రంప్ తీసుకొస్తే అది ఎక్కువమంది భారతీయులకు మేలును అందిస్తుందని అంటున్నారు.