ముప్పతిప్పలు పెడుతున్న ఆ రెండు డొమెస్టిక్ ఎయిర్ లైన్స్

* 15 నుంచి డొమెస్టిక్ సర్వీసుల పునః ప్రారంభం అనుమానమే

* ఎయిర్ ఇండియా మాత్రం ఏప్రిల్ 30 తర్వాతే అంటోంది


ఇండిగో, స్పైస్ జెట్ విమానయాన సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా , ఈ నెల 15 నుంచి తలపెట్టిన డొమెస్టిక్ ఎయిర్లైన్స్  సర్వీసుల విషయం లో -పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఇద్దరు ఆపరేటర్లు రకరకాల తలనొప్పులు తెస్తున్నట్టు, ఫలితంగా ఈ నెల 15 న తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్న డొమెస్టిక్ సర్వీసుల విషయం లో ఇంకా ఒక క్లారిటీ రాలేదని అధికారులు అంటున్నారు. ఈ రెండు ఎయిర్ లైన్స్ ఇప్పటికే, తాము చెల్లించాల్సిన రిఫండ్ విషయం లో ఎయిర్ పాసెంజర్స్ ను ఇబ్బంది పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో 15 నుంచి ఎయిర్ ఇండియా మినహా మిగతా అన్ని పౌరవిమానయాన సంస్థలూ విమాన సర్వీసులను నడిపించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటుందని, సమయ పాలన పాటించే అవకాశాలు అంతంతమాత్రమేనని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

21 రోజుల లాక్ డౌన్ అనంతరం 15 నుంచి సర్వీసులను నడిపించేందుకు ఇప్పటికే ప్రైవేట్ ఎయిర్ లైన్స్ బుకింగ్ లను తీసుకుంటున్నాయి. "ఇండియాలో వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. అందువల్ల 14 తరువాత పరిమిత సంఖ్యలోనే దేశవాళీ, అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తాం. ఏప్రిల్ 14 తరువాత బుకింగ్స్ స్వీకరించే వెసులుబాటును, స్వేచ్ఛను ఎయిర్ లైన్స్ కు కల్పించాం" అని పౌర విమానయాన శాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఇదే సమయంలో 14 తరువాత లాక్ డౌన్ కొనసాగితే, విమానాలు కూడా రద్దువుతాయని, బుక్ చేసుకున్న టికెట్లు వాటంతట అవే క్యాన్సిల్ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఎయిర్ ఇండియా మాత్రం ఏప్రిల్ 30 వరకూ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మే 1 నుంచి ఎయిర్ ఇండియా బుకింగ్స్ స్వీకరిస్తోంది.

ఇక ఇప్పటికే మాంద్యంలో కూరుకుపోయిన విమానయాన సంస్థలు ఉద్యోగులకు వేతనాల్లో కోతను విధిస్తున్నాయి. ఇండిగో, తన సీనియర్ ఉద్యోగులకు 25 శాతం కోతను ఇప్పటికే ప్రకటించగా, ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ మినహా ప్రతి ఉద్యోగికీ, మూడు రోజుల వేతన రహిత సెలవు తప్పనిసరి చేసింది. గో ఎయిర్ సైతం వేతనాల్లో కోతను విధించింది. ఉద్యోగులు రేషనల్ బేసిస్ లో వేతనం లేకుండా సెలవు తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన విధించింది. మార్చి 25న మొదలైన 21 రోజుల లాక్ డౌన్ మరో 8 రోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు వారాలూ అన్ని దేశవాళీ, విదేశీ కమర్షియల్ విమానాలు రద్దయ్యాయి.