TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పశ్చిమ బెంగాల్ లో దీదీ పతనం వెనుక ఉన్నదెవరో తెలుసా?

Published on: Sat May 9, 2026 9:02AM

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో   తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అనూహ్య పతనాన్ని చవిచూసింది. బెంగాల్ ప్రజల చేత దీదీగా పిలిపించుకున్న మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికలలో  పార్టీ పరాజయమే కాదు.. స్వయంగా తన ఓటమినీ చవి చూశారు.  అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీయే అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పార్టీకి వెన్నెముకగా నిలిచిన సీనియర్ నేతలను దూరం చేసుకోవడం.. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలే తృణమూల్‌ను దెబ్బతీశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు. సీనియర్లను గౌరవించకుండా.. అభిషేక్ బెనర్జీ   తన వర్గానికే పెద్దపీట వేయడం వల్ల పార్టీ లోపల అసమ్మతి జ్వాలలు చెలరేగి, చివరకు అది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషిస్తున్నారు. 

నందిగ్రామ్ పోరాటం ద్వారా మమతను అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి, అభిషేక్ తీరుతో విసిగిపోయి బీజేపీలో చేరారు. గతంలో నందిగ్రామ్‌లో మమతపై గెలిచిన ఆయన, తాజా ఎన్నికల్లో మమతకు కంచుకోట అయిన భవానీపూర్ స్థానంలోనే ఆమెను ఓడించి చరిత్ర సృష్టించారు. కష్టపడి పనిచేసే నాయకులను పక్కన పెట్టడం వల్ల కలిగే నష్టానికి మమతా బెనర్జీ భారీ మూల్యం చెల్లించుకున్నట్లయింది.

అభిషేక్ బెనర్జీ అనుసరించిన  డైమండ్ హార్బర్ మోడల్' పాలనలో అక్రమాలు జరిగాయనీ..  దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విపక్షాలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఈవీఎంలపై నెపం నెట్టడం..  ఎన్నికల కమిషన్‌తో ఘర్షణ వంటి చర్యలు ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి. టీఎంసీలోని పాత తరం నేతలు కూడా అభిషేక్ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్నారనేది బహిరంగ రహస్యం.

మమత   మేనల్లుడికి అపరిమితమైన అధికారాలు ఇవ్వడం టీఎంసీ పతనానికి దారితీయగా, సువేందు అధికారి పట్టుదల బీజేపీకి బెంగాల్ గడ్డపై మొదటిసారి అధికారాన్ని కట్టబెట్టింది. ఈ పరిణామాలతో బెంగాల్ రాజకీయాల్లో మమత-అభిషేక్ శకం ముగిసిందని, సువేందు నాయకత్వంలో కొత్త అధ్యాయం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.