టిక్ టాక్ యూజర్స్ పరిస్థితేంటి?.. ఇండియాలో యాప్ పనిచేస్తుందా?
posted on Jun 30, 2020 3:01PM
చైనాకు చెందిన 59 మొబైల్ యాప్లను భారత్లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది. బ్యాన్ తో ఇప్పటికే టిక్ టాక్.. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ ల నుంచి మాయమైంది. దీంతో టిక్ టాక్ ని వ్యతిరేకించే వారు సంతోషపడుతుండగా.. టిక్ టాక్ ని అభిమానించే వారు తెగ బాధపడిపోతున్నారు. అయితే కొందరు మాత్రం.. ప్లే స్టోర్ నుంచి తొలగించినంత మాత్రాన ఏం కాదు. ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకున్న వారు హ్యాపీగా వాడుకోవచ్చని చెబుతున్నారు. మరికొందరైతే, వెబ్ సైట్ల నుంచి ఏపీకే లను డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చని చెబుతున్నారు. దీంతో కొందరు టిక్ టాక్ యూజర్స్ సంతోషపడుతున్నారు. కొందరు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే యాప్ ఇన్స్టాల్ చేసుంటే ఆ యాప్ నిజంగా పని చేస్తుందా?.. ఒకవేళ యాప్ ఉపయోగిస్తే చట్టపరంగా ఇబ్బందులు ఏవైనా ఎదుర్కొనే ప్రమాదం ఉందా?.. అని టిక్ టాక్ యూజర్స్ తెగ ఆలోచిస్తున్నారు. అయితే, ఒకవేళ యాప్ ఇన్స్టాల్ అయి ఉన్నప్పటికీ అది పని చేయదని తెలుస్తోంది. నిషేధించిన ఆ చైనా యాప్స్ అన్నీ ఆన్లైన్ ఆధారంగా పని చేసేవే. అవి స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ అయి ఉన్నప్పటికీ పని చేయవు. ఆ యాప్లలో అప్డేట్లు ఇకపై కనపడవు.
బ్యాన్ విధింపుతో ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు ఈ యాప్స్ కు ఇండియాలో డేటా, ఇంటర్నెట్ ట్రాఫిక్ యాక్సెస్ చేయకుండా బ్లాక్ చేస్తాయి. గతంలో ఓ యాప్ నిషేధానికి గురైతే డేటాతో సంబంధం లేకుండా పని చేసేది. కానీ, నెట్వర్క్స్ కూడా ఈ 59 యాప్స్కి డేటా సరఫరా చేయొద్దని ఆదేశాలు అందడంతో భారత్ లో ఇవి పని చేయడం అసాధ్యం.
టిక్ టాక్ తో సహా నిషేధానికి గురైన ఏ యాప్ కూ ఇక అప్డేట్స్ చూపించవు. అయినా ఫోన్లలో ఆ యాప్స్ను ఉంచుకుంటే భద్రత తగ్గి హ్యాకర్ల బారిన పడే అవకాశం ఎక్కువ. ఆ యాప్స్ను స్మార్ట్ఫోన్లలో ఉంచుకోకపోతేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో భద్రత తగ్గిపోతుండడంతో వాటి ద్వారా స్మార్ట్ ఫోన్లు హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.