కాంగ్రెస్ తో డీఎంకే కటీఫ్
Published on: Fri May 8, 2026 5:02PM

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ తో దశాబ్దాల నాటి పొత్తును డీఎంకే తెగతెంపులు చేసుకుంది. టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. కాంగ్రెస్తో పొత్తు ముగిసినందున, ఇకపై వారితో కలిసి కూర్చోవడం సముచితం కాదని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. డీఎంకే నిర్ణయం జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన పని లేదు.
ఇలా డీఎంకే కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పేసిందో లేదో అలా తమిళనాట ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. మైలదుత్తురైలో డీఎంకే మద్దతుదారులు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిన్నటి వరకూ మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ డీఎంకేలు ఇప్పుడు బద్ధ శత్రుపక్షాలుగా మారిపోయి పరస్పర దాడులకుదిగడం సంచలనంగా మారింది.


