TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తమిళనాడులోకి బీజేపీ ఎంట్రీ, చతికిలపడిన డీయంకె

Published on: Mon Dec 22, 2014 7:05AM

 

తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమయిన డి.యం.కే.పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రముఖ సినీతార మరియు పార్టీలో సీనియర్ నాయకురాలు అయిన కుష్బూ కొన్ని వారాల క్రితమే ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఇప్పుడు మరో సీనియర్ నేత నెపోలియన్ కూడా పార్టీని వీడి నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన తన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తునట్లు పంపిన లేఖను డి.యం.కె. అధినేత కరుణానిధి ఆమోదించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ కూడా బీజేపీలో చేరారు.

 

తమిళనాడు కేరళ రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆ రెండు రాష్ట్రాలలో పర్యటించిన అమిత్ షా ఈ సందర్భంగా చెన్నైలో మాట్లాడుతూ 2016సం.లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ముందుగా తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించి ఎన్నికలకు వెళతామని తెలిపారు.

 

నెపోలియన్ చేరిక బీజేపీకి చాలా బలం చేకూరిస్తే, డి.యం.కె. పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత కరుణానిధి వయోభారంతో పార్టీని నడుపలేని స్థితికి చేరుకొంటే, ఆయన ఇద్దరు కుమారులు అళగిరి, స్టాలిన్ పార్టీ ఆధిపత్యం కోసం పోరాడుకొని విడిపోయారు. అళగిరిని పార్టీ నుండి సప్స్పెండ్ చేసినా పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు పైగా నానాటికీ మరింత క్షీణిస్తోంది.

 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అరెస్టు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడిన కారణంగా అధికార అన్నాడీఎంకెపార్టీ చాలా బలహీనంగా ఉన్నప్పుడు, ఇటువంటి అవకాశం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డీయంకె ఇప్పుడు ఆ గొప్ప అవకాశాన్ని అందుకోలేక చతికిలపడితే, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చురుకుగా కదిలి ఆ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవదానికి గతి ప్రయాణాలు చేయడం విశేషం. అమిత్ షా ఇదే దూకుడు ప్రదర్శిస్తే బహుశః వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మొట్టమొదటిసారిగా తమిళనాడులో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంటుందని భావించవచ్చును.