తప్పున్నా...తప్పుకోమనకూడదు..
posted on Dec 19, 2013 5:49PM
ఇలాంటి విచిత్రమైన స్టేట్ మెంట్లు ఇవ్వగలిగిన నాయకులు మన రాష్ట్రంలో కొంతమందే ఉన్నారు. చాలా కాలం తర్వాత గురువారం నోరువిప్పిన మాజీమంత్రి డీ.ఎల్ రవీంద్ర రెడ్డి కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయారు. పార్టీ పగ్గాలు ఎవరికైనా అప్పజెప్పాలంటూ సోనియా గాంధీ పై జె.సి. దివాకర్ రెడ్డి చేసిన కామెంట్ పై ఆయన లేట్ గా అయినా వెరైటీగా స్పందించారు. ''రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి అధిష్టానమే కారణం. అయితే సోనియా గాంధీ తప్పు చేసి ఉండవచ్చు. కానీ ఒక్క తప్పుకే అలా తప్పుకోమనకూడదు''అంటూ ఆయన విచిత్రంగా వ్యాఖ్యానించారు.
ఒకవైపు అధినేత తప్పు చేశారంటూనే మరోవైపు తప్పుకోకూడదంటూ విమర్శనూ, మద్దతునూ కలగలిపి డీఎల్ ఇచ్చిన స్టేట్ మెంట్ లోతులు వెతికే పనిలో పడ్డారు విశ్లేషకులు. పనిలో పనిగా ముఖ్యమంత్రి కిరణ్ పార్టీ పెడతారని తాను అనుకోవడం లేదన్న డీఎల్....జె.సి, గాదె వె౦కట రెడ్డి లాంటి నేతలు మాత్రం కిరణ్ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. మిగిలినవారు ఎటు ఎటు దూకుతారో అని బాగానే గమనిస్తున్న డీ.ఎల్ ఇంతకీ తానే పార్టీలోకి జంప్ జిలానీ అవుదామనుకుంటున్నారో చెప్పాలని కొందరు గుసగుసలాడుతున్నారు.