దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు.. టాలీవుడ్ పెద్దల పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు

సినీ పరిశ్రమని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణాంతరం వెలుగుచూసిన ఈ వ్యవహారం తెలుగు, కన్నడ ఇండస్ట్రీలకు సైతం పాకింది. ఇప్పటికే పలువురు ప్రముఖ హీరోయిన్లు డ్రగ్స్ వ్యవహారంలో ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ ఉందంటూ నటి, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

తెలంగాణ టీడీపీ తెలుగు మహిళ ఆధ్వర్యంలో సోమవారం 'తెలంగాణ మహిళా కమిషన్ ఆవశ్యకత-ఏర్పాటు' పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యవాణి మాట్లాడుతూ సినీ పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు సైతం డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని ఆరోపించారు. వివిధ అవసరాల కోసం దిగజారే రకాలు సినీ రంగంలో ఉన్నారని అన్నారు. 

 

టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో గతంలో చేపట్టిన విచారణ ఎంత వరకు వచ్చిందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. వివిధ రంగాల్లో ఉన్నట్లే సినీరంగంలో కూడా డబ్బు ఉన్నవాళ్ళదే రాజ్యం అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి? పెద్ద హీరోలతో నటించకపోవటానికి, ఎక్కువ సినిమాలు చేయకపోవటానికి వివిధ కారణలున్నాయని అన్నారు. సినీ రంగంలో మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. తన కూతురు చదువుకుంటున్న హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో కూడా డ్రగ్స్ కు అలవాటు పడిన విద్యార్థులు ఉన్నారని దివ్యవాణి ఆరోపించారు. డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమని కుదిపేస్తున్న తరుణంలో దివ్యవాణి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.