చర్చలు సఫలం... ఏపీలో ఆర్టీసీ సమ్మె ఉపసంహరణ

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు గురువారం నుంచి సమ్మె చేయాలని తలపెట్టిన విషయం తెలిసిందే. తాము దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి సమ్మె చేయబోతున్నామని కార్మికులు ప్రకటించారు. సమస్యల పరిష్కారం విషయంలో ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తాము సమ్మె నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆర్టీసీ కార్మికులు చెప్పారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఈనెల 8వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు బుధవారం నాడు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదమయ్యాయి. డీఏ, పండగ బకాయిలను చెల్లించడంతోపాటు నిర్ణీత గదువు లోగా సమస్యలను పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.