జగన్, బాబులపై ట్విట్టర్ లో డిగ్గీ
posted on Oct 7, 2013 11:19AM
సీమాంధ్ర అభివృద్ధికి ప్యాకేజీ ఇస్తామని, సీమాంధ్ర ప్రజలకు హైదరాబాద్లో విద్యా, వైద్య అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. సీమాంధ్రలో ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలని కోరారు. హైదరాబాద్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ పూర్తి భద్రత కల్పిస్తామని దిగ్విజయ్ సింగ్ భరోసా ఇచ్చారు. విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలకు కూడా పరిష్కారం కనుగొంటామని చెప్పారు. సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్లో ఉన్నా, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో... ఎక్కడ ఓటర్లుగా నమోదైతే అక్కడి పౌరులే అవుతారని, వారి హక్కులను ఎవ్వరూ కాలరాయలేరని అన్నారు.
రాజకీయ లబ్ది కోసమే రాష్ట్ర విభజన అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట మార్చారని అన్నారు. తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తూ లేఖలు ఇచ్చిన టీడీపీ, వైసీపీ ఇప్పుడు తీరు మార్చుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని దిగ్విజయ్ పేర్కొన్నారు. గతంలో చేసిన హామీల నుంచి వెనక్కి పోవద్దని చంద్రబాబు, జగన్లకు విజ్ఞప్తి చేశారు.