ఖమ్మం జిల్లాలో కలవని కాంగ్రెస్, పి.ఆర్.పి.
Published on: Thu Apr 26, 2012 12:14PM
చిరంజీవి తానేర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీని కనగ్రేస్ పార్టీలో విలీనం చేశారు. అందుకు బహుమానంగా ఆయనకు రాజ్యసభ పదవీ, తన సహచరులు ఇద్దరికీ మంత్రి పదవులు కూడా దక్కాయి. తన స్వీయలక్ష్యాలను నెరవేర్చుకున్న చిరంజీవి పి.ఆర్.పి. కార్యకర్తల మనస్సును మాత్రం మార్చలేకపోయారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తో విలీనాన్ని పి.ఆర్.పి. నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ ఆమోదించలేకపోతున్నారు.. ఈ జిల్లాలో కాంగ్రెస్, పి.ఆర్.పి. విలీనానికి చిహ్నంగా ఒక సభ ఏర్పాటు చేయాలని చాలారోజుల క్రితమే నిర్ణయించారు. కానీ, ఈ సభను మాత్రం ఇప్పటిదాకా ఏర్పాటు చేయలేకపోయారు.
దీనికి ప్రధానకారణం ఈ రెండు పార్టీల నాయకుల మధ్య మనసులు కలవకపోవటమేనని తెలుస్తోంది. చిరంజీవి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఈ జిల్లాలో అడుగుపెట్టలేదు. దీంతో పి.ఆర్.పి. క్యాడర్ అంతా నిరాశకు గురైంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పి.ఆర్.పి. నేతలను, కార్యకర్తలను దగ్గరకు రానీయటం లేదు. ఈ నేపథ్యంలో పి.ఆర్.పి. నేతలు కాంగ్రెస్ పంచన చేరే బదులు తెలుగుదేశం లేదా వై.ఎస్.ఆర్. కాంగెస్ పార్టీల్లో చేరితే కొంత గౌరవమైనా దక్కుతుందనేనే భావనతో ఉన్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్, పి.ఆర్.పి.లు ఎప్పుడో విలీనమైనప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఆ విలీనం ఛాయలేవీ కనిపించటం లేదు.


