TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ధోనీ చివరి మ్యాచ్ అడేస్తున్నాడా?

Published on: Mon May 18, 2026 10:16AM

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన స్కిప్పర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో తన చివరి మ్యాచ్ అడేయడానికి రెడీ అయిపోయాడా?.. సోమవారం (మే 18) సన్ రైజర్స్ హైదరాబాద్ లో జరగనున్న మ్యాచ్ తరువాత రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? అంటే క్రీడా రంగ నిపుణులు, చైన్నై సూపర్ కింగ్స్ వర్గాలు ఔననే అంటున్నాయి.

ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడని మహేంద్రసింగ్ ధోనీ.. సోమవారం (మే 18) చెన్నై వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగనున్న మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాడని సీఎస్ కే వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా.. ఆదివారం నెట్ లో ధోనీ ప్రాక్టీస్ చేయడం కూడా ఈ మ్యాచ్ లో ధోనీ ఆడుతున్నాడనడానికి బలమైన సంకేతంగా పరిశీలకులు చెబుతున్నారు.  అంతే కాకుండా ప్రస్తుత సీజన్ లో  సీఎస్ కే హోమ్ గ్రౌండ్‌లో చివరి లీగ్ మ్యాచ్ ఇదే కావడం, ఆ మ్యాచ్ లోనే ధోనీ ఆడడానికి నిర్ణయించుకోవడంతో ఇదే ధోనీ చివరి మ్యాచ్ కావచ్చనీ, ఈ మ్యాచ్ తో ధోనీ క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తాడన్న వార్తలు గట్టిగా వినవస్తున్నాయి. 

గతంలో ధోనీ చేసిన కీలక వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.  తాను క్రికెట్ కెరీర్‌లోని ఆఖరి టీ20 మ్యాచ్‌ను చెన్నై అభిమానుల సమక్షంలోనే ఆడతానని,  2021లోనే  ధోనీ చెప్పేశాడు. ఆ సెంటిమెంట్‌ను గుర్తుచేసుకుంటున్న విశ్లేషకులు, అభిమానులు.. ఇదే ధోనీకి చివరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ధోనీ రిటైర్మెంట్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

  ధోనీ  కండరాల గాయం కారణంగా ఈ సీజన్ లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో  ఆడలేదు. అయితే హైదరాబాద్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ధోనీ  నెట్స్‌ దాదాపు గంట సేపు ప్రాక్టీస్ చేశాడు. దీంతో హైదరాబాద్ తో ఆదివారం (మే 18) జరిగే మ్యాచ్ లో ధోనీ బరిలోకి దిగడం ఖాయమని అంటున్నారు.   ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే సైతం   ఈ మ్యాచ్ లో  ధోనీ ఆడే అవకాశం ఉందని పేర్కొనడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది.  అయితే ఇప్పటి వరకూ  ధోనీ రిటైర్మెంట్ గురించి కానీ, సన్‌రైజర్స్‌తో మ్యాచ్ లో ధోనీ  ఆడటంపై కానీ సీఎస్‌కే మేనేజ్‌మెంట్ నుంచి కానీ ధోనీ నుంచి కానీ ఎలాంటి స్పష్టతా లేదు.