ధర్మాన రాజీనామా ఆమోది౦చాలంటున్న ఢిల్లీ పెద్దలు
Published on: Fri Aug 24, 2012 10:42AM
మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా వ్యవహారంపై అధిష్ఠానం వెంటనే తన నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆయన రాజీనామాను ఇప్పటికే ఆమోదించి ఉండాల్సిందని అధిష్ఠానం ఆభిప్రాయపడినట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వచ్చిన సీఎం కిరణ్ కేంద్ర మంత్రులు చిదంబరం, ఆంటోనీలతో అరగంట చొప్పున సమావేశమయ్యారు.
రాత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్తో గంటన్నరపాటు, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్తో రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా భేటీ అయ్యారు. శుక్రవారం ఆయన సోనియా, ప్ర«ధాని మన్మోహన్లను కలుసుకోనున్నారు. ధర్మాన రాజీనామా వ్యవహారంపై పార్టీ పెద్దలందరికీ కిరణ్ వివరణ ఇచ్చారు. "మంత్రులు ఆరోపణలు ఎదుర్కోవటం ఒక ఎత్తు. విచారణ సంస్థ ఏకంగా అభియోగాలు నమోదు చేయడం ఒక ఎత్తు.
ధర్మాన రాజీనామా చేయటాన్ని పార్టీ, ప్రభుత్వం స్వాగతించాలి'' అని కోర్ కమిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు తెలిసింది. అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రిని కూడా కేబినెట్లో కొనసాగిస్తే, అవినీతి ప్రభుత్వం అన్న ముద్ర పడుతుందని... అలా జరగటం పార్టీకి కూడా మంచిది కాదని హితవు పలికారు. ఈ నేపథ్యంలో ధర్మాన రాజీనామాను ఆమోదించాలని ఆజాద్, అహ్మద్ పటేల్ సీఎంకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


