ఉమేష్ కుమార్ కి అంతా పెట్రోలై మండుతోంది!
Published on: Fri Aug 31, 2012 1:07PM
సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ సస్పెన్షన్ ఉత్తర్వుల్ని కేంద్ర హోంశాఖ కొట్టేసింది. రాష్ట్రానికి కొత్త డిజిపిగా ఆయన నియమితులయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు కోడైకూస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం డిజిపి పదవి న్యాయంగా ఉమేష్ కుమార్ కే దక్కాలి. కానీ.. గతంలో రాష్ట్రప్రభుత్వం ఆయన్ని తోసిరాజని దినేష్ రెడ్డిని డిజిపిగా నియమించింది.
.jpg)
కడుపుమంటపట్టలేకపోయిన ఉమేష్ కుమార్ దినేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ ఎంపీ లెటర్ హెడ్ మీద లేనిపోని కంప్లైంట్లు చేస్తూ కేంద్రానికి లేఖరాసి ఫోర్జరీ సంతకం చేశారంటూ అప్పట్లోపెద్ద గొడవకూడా జరిగింది. దీనిపై విచారణ జరిపిన సిఐడి అధికారులు ఉమేష్ ని అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన ఎవరికీ చెప్పకుండా చాకచక్యంగా ఉడాయించారని లోకల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం కూడా జరిగింది.

చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరయ్యారన్న నెపంతో ఉమేష్ కుమార్ మీద జూన్ నెలలో రాష్ట్రప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేస్తే 90 రోజుల్లోగా ఆ విషయాన్ని కేంద్ర హోం శాఖకి నివేదించాలి. సస్పెన్షన్ కొనసాగించాలా లేక ఎత్తేయాలా అన్న నిర్ణయం కేంద్రం హోంశాఖ చేతుల్లోనే ఉంటుంది. ఉమేష్ కుమార్ సెలవుకోసం దరఖాస్తు పెట్టుకున్నారు కనుక చెప్పాపెట్టకుండా గైర్హాజరైనట్టు భావించడానికి ఆస్కారమే లేదంటూ కేంద్ర హోం శాఖ సస్పెన్షన్ ని ఎత్తేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం ఉమేష్ కి కాలం కలిసొస్తోంది. కారుమేఘాలన్నీ ఒక్కటొక్కటిగా విడిపోతున్నాయి. 1977కి చెందిన దినేష్ రెడ్డి బ్యాచ్ లో ఉమేష్ కుమార్ తప్ప మిగతావాళ్లంతా రిటైరైపోయారు. డిజిపి నియామకానికి సంబంధించి మరో కొత్త జాబితాని తయారుచేసి పంపాలని యూపీఎస్సీ ఆదేశించిన సమయంలో ఉమేష్ కుమార్ పై కేంద్ర హోంశాఖ సస్పెన్షన్ ని ఏత్తేయడం కీలక పరిణామం.


