విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు.. త్వరలోనే మళ్ళీ జైలుకి

 

వైసీపీ నేత విజయసాయి రెడ్డి తనపై చేసిన విమర్శలకు మంత్రి దేవినేని ఉమా కౌంటర్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా.. "మరో 4 వారాలు ఓపిక పట్టు ఉమా. ఇరిగేషన్ శాఖలో ఐదేళ్లుగా నువు సాగించిన అరాచకం అంతా బయటకొస్తుంది. అధికారులు, బాధితులైన కాంట్రాక్లర్లు నీ దోపిడీ వ్యవహారాల ఫైళ్లను స్వచ్ఛందంగా తెచ్చిస్తున్నారు. పోలవరం, హంద్రీ-నీవాల్లో రెండేళ్లలోనే వందల రెట్లు అంచనాలు పెంచింది నిజం కాదా?" అని తీవ్ర విమర్శలు చేశారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన దేవినేని ఉమా.. విజయ సాయి రెడ్డిపై అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు.

ఒక ఆర్థిక ఉగ్రవాది కేంద్రప్రభుత్వంతో, కేసీఆర్‌తో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నాడంటూ ధ్వజమెత్తారు. తమ సంగతి చూస్తామంటూ బెదిరింపు ధోరణిలో ఉంటున్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటే అతని బెయిల్ కూడా రద్దు అవ్వడం ఖాయమన్నారు. ఏ1, ఏ2 అయిన వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలకు మళ్ళీ జైలుకెళ్లడం తప్పదని అన్నారు. అప్పుడు విజయసాయికి పండ్లు పంపిస్తానని ఎద్దేవా చేశారు. రాజాంగేతర శక్తిగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ట్విట్టర్లో కాకుండా నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. 350 కోట్లు వెచ్చించి పెట్టుకున్న ప్రశాంత్ కిషోర్ పోతూపోతూ ఒక నేమ్ బోర్డ్ ఇచ్చివెళ్లాడని.. ఆ బోర్డు జైలు బ్యారక్ లో పెట్టుకోండని సెటైర్లు వేశారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగుతుందంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతిపరులు పోలవరంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. అసలు వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిలకు ప్రజాక్షేత్రంలో తిరిగే అర్హత లేదన్నారు. వీరిద్దరూ తీహార్ జైల్లో ఉండాల్సిందేన్నారు. పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును కేంద్రం ఇంత వరకు చెల్లించలేదని అన్నారు. అయినా పోలవరం పూర్తవుతుందంటే అది చంద్రబాబు ఘనతేనని, పోలవరాన్ని ముఖ్యమంత్రి శరవేగంగా నిర్మిస్తున్నారని దేవినేని ఉమా కొనియాడారు.

ఒకప్పుడు పోలీసులను చూసి దొంగలు పారిపోయేవారని, కానీ ఇప్పుడు దొంగలు ఫిర్యాదు చేస్తే పోలీసులు మారిపోతున్నారని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. అధికారులను బెదిరించే విధంగా వైసీపీ నేతల తీరు ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాస్తే వైసీపీ ఎందుకు ఉలిక్కిపడుతుందోనని ఉమా నిలదీశారు.  వైసీపీపై బెట్టింగ్‌ పెట్టిన వాళ్లంతా డబ్బులు తిరిగివ్వమని ప్రాధేయపడుతున్నారని, తిరిగి టీడీపీ గెలుపుపై బెట్టింగ్‌లు పెడుతున్నారంటూ దేవినేని ఉమా చెప్పుకొచ్చారు.