జగన్ నవరత్నాల్లో అప్పుడే ఒకటి రాలిపోయింది!!

 

వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల్లో అప్పుడే ఒక రత్నం రాలిపోయిందని టీడీపీ నేత దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. 22 రోజుల వ్యవధిలోనే జగన్ మాటతప్పారని అన్నారు. గుడ్లవల్లేరు మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగిన కార్యకర్తల సమావేశంలో అవినాష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు వృద్ధులకు రూ. 3 వేల పెన్షన్ ఇస్తానని చెప్పి, ఇప్పుడు దాన్ని రూ. 2,250కి కుదించారని ఆయన విమర్శించారు. అమ్మఒడి విషయంలోనూ ప్రభుత్వం తడబడిందని, ఒకటి చెప్పి మరొకటి చేయబోతే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతోనే సర్దుకున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆరోపించిన అవినాష్.. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపే రోజులు ఇప్పుడు లేవని, రెండు చెంపలనూ వాయించి చూపుతామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధమై, ఘన విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు.