TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ రౌడీల తోలు తీస్తా.. పవన్ మాస్ వార్నింగ్

Published on: Sun Jun 21, 2026 1:05PM

 

నేను హోంమంత్రిని కాకపోవడం ఆ క్రిమినల్స్ అదృష్టం...

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్స్, రౌడీ మూకలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అధికారం కోల్పోయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా నేరపూరిత ధోరణి వీడలేదని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం కాకినాడలో నిర్వహించిన ‘మన ఊరు- మాటామంతీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వైసీపీ గూండాల ఆటలు ఇక సాగనివ్వబోమని, వారిని తొక్కి నారతీస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో తాను ఎంతో సహనంతో వ్యవహరించానని, అయితే ప్రతిపక్ష నేతలు దీనిని చేతకానితనంగా భావిస్తున్నట్లున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ గడువులో ఇంకా మూడేళ్ల సమయం ఉందని, ఇకపై అసలైన యాక్షన్ చూపిస్తానని స్పష్టం చేశారు. నేరస్తులను కేవలం నేరగాళ్లుగానే చూడాలని, వారికి కులం, మతం రంగులు పూసి వెనకేసుకురావడం సమాజానికి తీవ్ర నష్టమని హితవు పలికారు. కులాల దరిద్రం పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిని కాకపోవడం క్రిమినల్స్ చేసుకున్న అదృష్టమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సీఎంపై మాత్రమే ఆధారపడకుండా, నేరుగా ప్రజల పక్షాన నిలబడి పోరాడతానని చెప్పారు. గత వైసీపీ పాలనలో సాక్ష్యాధారాలను ఎంత దారుణంగా ధ్వంసం చేశారో చెప్పడానికి సుగాలి ప్రీతి కేసే నిదర్శనమన్నారు. తాము అధికారంలోకి రాగానే ఆ కేసుపై దృష్టి పెడితే.. అప్పటికే డిఎన్ఏ ఫైళ్లను, ఇతర కీలక ఆధారాలను వైసీపీ ప్రభుత్వం మాయం చేసిందని ఆరోపించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులోనూ దోషులెవరో అందరికీ తెలిసినా, సరైన ఆధారాలు లేకుండా పోయాయని గుర్తుచేశారు.

కొందరు అధికారులు ఇంకా పాత ప్రభుత్వానికి నమ్మకంగా ఉంటూ నేరగాళ్లకు మద్దతు ఇస్తున్నారని, అలాంటి వారి జాబితా తన వద్ద ఉందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. మహిళలను, హోంమంత్రిని సైతం అసభ్యకరంగా మాట్లాడే సంస్కృతిని సమాజం సహించబోదన్నారు. గతంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు మాట్లాడని వారు.. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కులాలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి అన్యాయాలపై ధైర్యంగా గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే శాంతిభద్రతలు సజావుగా ఉండటం ఎంతో కీలకమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో మళ్లీ వైసీపీ వస్తుందనే భయంతో ఉన్న ప్రజలకు ఆయన ధైర్యం చెబుతూ, క్రిమినల్స్ రాజ్యాన్ని కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రానివ్వదని తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో రౌడీ మూకల పట్ల చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, శాంతియుత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.