TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ ప్రభుత్వంలో సాయం అడగడానికి భయపడాల్సి వచ్చేది : దిల్ రాజు

Published on: Mon May 26, 2025 5:16PM

 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో సపోర్ట్ చేశారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సాయం అడగడానికి భయపడాల్సి వచ్చేదని ఆయన అన్నారు. పవన్ వచ్చిన తర్వాత నిర్మాతలు ఏపీకి పక్కింటి వెళ్లొచ్చినట్లు వెళ్లొస్తున్నారని ఆయన తెలిపారు. ఓ అప్లికేషన్ లేదా ఫోన్‌లో మాట్లాడితే సినిమా టికెట్ల ధరలు పెరిగిపోతున్నాయన్నారు. టాలీవుడ్‌లో కొందరు ఎంతకు దిగజారిపోతున్నారో వారు చేస్తున్న పనులు చూస్తుంటే తెలుస్తుందని ఆయన అన్నారు.ఇటీవల థియేటర్ల విషయంలో నెలకొన్న కాంట్రావర్సీపై ఆయన స్పందించారు. 

తెలంగాణలో 370 థియేటర్లు ఉంటే.. వాటిలో 30 థియేటర్లు తనవేనన్నారు. పవన్ కళ్యాణ్ మా పెద్దన్న ఆయన తిడితే మేము పడతామని దిల్‌రాజు అన్నారు. పవర్ స్టార్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. మీడియా వల్ల జరిగిన మిస్ కమ్యూనికేషన్ కారణంగానే పవన్ కల్యాణ్ హార్ట్ అయ్యాడని ఆయన పేర్కొన్నారు. తాను హాలిడేకు వెళ్లి వచ్చేసరికి మే18న ఎగ్జిబిటర్లు మీటింగ్ పెట్టుకున్నారని, చివరి పావుగంట మాత్రమే మీటింగ్ కు వెళ్లానని చెప్పారు. వారు అక్కడ సినిమాలపై పర్సంటేజిలపై తమకున్న డిమాండ్లను చెప్పారని, వారి సమస్యల్ని పరిష్కరించేందుకే తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంతలోనే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్  అనే వార్తలొచ్చాయని అసహనం వ్యక్తం చేశారు. 

డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో పూర్తిస్థాయి సమావేశం జరగకుండానే ఇలాంటి న్యూస్ ను వ్యాప్తి చేయడంపై ఆవేదన చెందారు. ఇదే అంశంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్  తనతో మాట్లాడారని, థియేటర్లు మూసివేయరని ఆయనకు అప్పుడే చెప్పానని వెల్లడించారు. ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించిన జాయింట్ మీటింగ్ లోనే థియేటర్ల అంశంపై స్పష్టత వచ్చిందని, ఈలోపే కొందరు ప్రభుత్వాలకు తప్పుడు సమాచారం అందించడం వల్ల ఇది వివాదం రూపుదాల్చిందని దిల్ రాజు పేర్కొన్నారు. మే 30న భైరవం, జూన్ 5న కమల్ హాసన్ సినిమా, జూన్ 12 పవన్ కల్యాణ్   సినిమా, జూన్ 20 కుబేర సినిమాలు ఉన్నాయి... జులై, ఆగస్టులో కూడా కొత్త చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా థియేటర్లు మూసివేసుకుంటారా? అని ప్రశ్నించారు. అలా చేస్తే ఎగ్జిబిటర్లకే కదా నష్టం అని అన్నారు.