TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆయారాం.. గయారాం..

Published on: Wed May 13, 2026 8:44PM

 

ప్రజాస్వామ్యం వచ్చింది...
పాలకుండలాంటి ఓటు హక్కును తెచ్చింది.
ఎన్నికలు వచ్చాయి...
రంగురంగుల జెండాలు,
వేర్వేరు అజెండాలతో రెపరెపలాడుతాయి.
అందరూ ఎన్నో కలలు చూపిస్తూ,
“మీ ఆశలు నెరవేరుస్తాం” అంటూ
చేతులు జోడించి ఓటేయమంటారు.
తమ పార్టీ గుర్తును మరీ మరీ గుర్తుచేస్తారు.

ఎన్నికలు ముగిశాక...
అధికారమే పరమావధిగా,
కొంతమంది జెండాలు మార్చడం
నిత్యం జరిగే రాజకీయ సత్యమైపోయింది.
ఇలా సాగుతున్న ఈ రాజకీయ రంకుకు
చరమగీతం పాడాలని
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది
రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం.
కానీ ఆ చట్టానికే ఎన్ని చిల్లులు!
జెండాలు మార్చి, అజెండాలు మార్చుకున్న నాయకుల
సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం మాత్రం
ఎన్నికల కమిషన్‌కు ఇవ్వలేదు.

అధికార పార్టీ శిబిరం నుంచే వచ్చిన
సభాపతికే అప్పగించారు.
పాపం... వారి పదవి కూడా
ఆ పార్టీ భిక్షే కదా!
తమ నాయకుడి మాటకు వ్యతిరేకంగా
నిష్పాక్షికంగా చర్యలు తీసుకునే
సభాపతులు మన చట్టసభల్లో ఎంతమంది?
అందుకే “ఆయారాం గయారాం”ల ఆట
ఇప్పటికీ ఆగలేదు.
చట్టాలు చేసే చట్టసభలే
తమ చట్టాలకు ఇన్ని చిల్లులు పెడితే,
ఆ పాలకుండలోని పాలు నిలుస్తాయా?
ఎవరు వీరిని నిలదీయాలి?

పార్టీలకు కొమ్ముకాసే మీడియానా?
ఈ చోద్యం చూస్తూ మౌనంగా ఉండే విద్యావంతులా?
గుక్కెడు సారాకో,
ఎన్నికల ప్రలోభాలకో లొంగిపోయే ఓటరా?
ఎవరైనా సరే...
ఆ పిల్లి మెడలో గంట కట్టే ఎలుక కావాలి.
ఫిరాయింపుల నిరోధక చట్టం
ఇప్పుడొక అందమైన చిల్లుల జల్లెడలా మారింది.
అది నిజంగా పాలకుండలా నిలదొక్కుకోవాలంటే,
ఆ పెత్తనం ఎన్నికల కమిషన్ చేతుల్లో పెట్టాలి.

— డా. వి.డి. రాజగోపాల్.