న్యాయం కోసం గొంతెత్తితే.. లాఠీలకు పని చెబుతారా.. కేంద్రంపై నెటిజనుల ఆగ్రహం
Published on: Tue Jul 21, 2026 8:44AM

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని సోమవారం (జులై 20) శాంతియుతంగా నిర్వహిస్తున్న యువతపై పోలీసులు ఉక్కుపాదం మోపడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. అయినా.. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా విద్యార్థులు రోడ్లపైనే బైఠాయించి తమ హక్కుల కోసం నినదించారు.
ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఉద్రిక్త పరిణామాలు, పోలీసుల లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుననారు. అంతర్జాతీయ వేదికలపై ప్రతి క్లిష్టమైన సమస్యనూ శాంతియుత సంప్రదింపులు, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఉద్బోధించే ప్రధాని నరేంద్ర మోదీ.. సొంత దేశంలో భవిష్యత్తు భారతాన్ని నిర్మించే విద్యార్థుల ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేయడం ఎంటని నిలదీస్తున్నారు. తమ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిని తొలగించాలనీ, నీట్ లీకేజీపై జవాబుదారీ తనం ఉండాలనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్న విద్యార్థులను చర్చలకు పిలిచి మాట్లాడాల్సింది పోయి.. వారి గొంతు నొక్కాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకే విరుద్ధమని నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీట్ ప్రశ్రపత్రాల లీకేజీ కి వ్యతిరేకంగా ఆరంభమైన ఆందోళన దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. విద్యారంగ సంస్కరణల కోసం జూన్ 28 నుంచి వరుసగా 21 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను జంతర్ మంతర్ వద్ద నిరసన స్థలి నుంచి పోలీసులు బలవంతంగా సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించడం, మరోవైపు హైదరాబాద్లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఐవైఎఫ్, పిడిఎస్యు వంటి అనేక విద్యార్థి సంఘాలు ముట్టడించడం వంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థుల ఆగ్రహాన్ని ఇనుమడింప చేస్తున్నాయి.
Delhi NEET protest crackdown, Dharmendra Pradhan resignation, Modi government, NEET criticism, Sonam Wangchuk, online anger


