కెసిఆర్ దృష్టిలో 1956కి "ముందున్న తెలంగాణా జిల్లాలే''వి?

ABK Prasad separate telangan issue, ABK Prasad Kcr, separate telangan issue Kcr, ABK Prasad telangana, kcr ABK Prasad

 

- డా. ఎబికె ప్రసాద్

[సీనియర్ సంపాదకులు]
 

 

ఒకటిగా ఉన్న తెలుగుజాతిని చీల్చి, "ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తానని మాటయిస్తే'' తాను ఏర్పాటు చేసుకున్న సొంతపార్టీ (టి.ఆర్.ఎస్.)ను కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తానని కాంగ్రెస్ అధిష్ఠానవర్గంతో రహస్యమంతనాలు జరిపివచ్చిన కాంగ్రెస్ మాజీ సభ్యుడు, "తెలుగుదేశం'' పార్టీలో మాజీమంత్రి అయిన "బొబ్బిలిదొర'' కె.సి.ఆర్. మళ్ళీ క్షణానికొక మాట మారుస్తున్నారు. ఇలా అతని నాలుక పదేపదే తిరగబడుతూ కొత్త ప్రతిపాదనలతో కొత్త సమస్యలు లేవనెత్తుతూండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తల బద్ధలు కొట్టుకోవలసి వస్తోంది. ఈలోగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ప్రజలు ఆందోళన చెంది, భారీస్థాయిలో ఉద్యమాల బాట పట్టవలసి వస్తోంది. ప్రజలను ఎలా విరగదొక్కాలో తెలిసిన కె.సి.ఆర్. తాజాగా ఓ కొత్త నినాదం లేవనెత్తాడు. తన మాట విని, తన డిమాండ్ ను అంగీకరించి, ఆరు నూరైనా, నూరు ఆరైనా సరే "తెలంగాణా పునర్నిర్మాణం'' పేరిట తనను ప్రత్యేక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ప్రకటిస్తే సరి, లేదా అది నెరవేరే దాకా కాంగ్రెస్ తో సహకరించేది లేదని కాంగ్రెస్ అధిష్ఠానంతో ఆయన పేచీ పెట్టుకున్నాడు. ఈ "పేచీకోరు''తో తన అనాలోచిత నిర్ణయాల ద్వారా యిప్పటికే రెండు ప్రాంతాలలోనూ (సీమాంధ్ర, తెలంగాణా) పరువు ప్రతిష్ఠలు వేగంగా కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కె.సి.ఆర్. మాటలు వింటే "కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే''నన్న సామెతలా అవుతుందని భావించిన కాంగ్రెస్ రెండు ప్రాంతాలలోనూ తన మిగిలిన పరువును కాపాడుకోవడం కోసం "రెండు పడవలపై''న రెండు కాళ్ళు పెట్టి కె.సి.ఆర్.తో సంబంధం లేకుండా పార్టీని ఇటు తెలంగాణాలోనూ, అటు సీమాంధ్రలోనూ కొనవూపిరితోనైనా బతికించుకోవాలని నిర్ణయించుకుంది!

 

 

హైదరాబాద్ లో ఇటీవల భారీ ఎత్తున జరిగిన "సమైక్యాంధ్ర సభ'' జయప్రదం కావడంతో ఇటు తెలంగాణలో కెసిఆర్ (టి.ఆర్.ఎస్.) పార్టీతో నిమిత్తం లేకుండానే, సమైక్యాంధ్ర సభ తాకిడి ఫలితంగా వేరుగా ఒక సభ జరపాలని స్థానిక కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది; అటు కె.సి.ఆర్. వర్గం కూడా కాంగ్రెస్ తో సంబంధం లేకుండా లోపాయకారీగా కాంగ్రెస్ సభకు పోటీగా వేరే సభను వేరే తేదీల్లో జరపాలని నిర్ణయించుకుంది! అంటే అటువైపు, సమైక్యాంధ్ర సభలు జరపడానికి రాజకీయ నాయకులను వెలివేసి ఆంధ్రప్రదేశ్ ఎన్.జి.వో.ల సంస్థ కేవలం ఉద్యోగవర్గాలతో భారీస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించి ముందుకు సాగుతూండగా, ఇటు కె.సి.ఆర్. వర్గానికి, అటు కాంగ్రెస్ (తెలంగాణాలో) నాయకవర్గానికి "ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం'' అనే లక్ష్యం ఒకటే అయినా, ఒకే సభగా కాకుండా "ఎవరికీ వారే యమునా తీరే'' అన్నట్టుగా వేర్వేరుగా రెండు భిన్నమైన తేదీల్లో జరుపుకుంటున్నారు. అంటే, అక్కడ జరుగుతున్నది తెలుగుజాతి విడిపోకూడదు, "విడిపోతే చెడిపోతాం'' అన్న హెచ్చరికలతో ఉద్యోగ కార్మిక, కర్షక, విద్యార్థి, వర్తక, మహిళా, బడుగు బలహీనవర్గాల ప్రజాబాహుళ్యంతో, గ్రామ గ్రామం నుంచీ సాగుతున్న మహోద్యమం కాగా, ఇక్కడ మన తెలంగాణలో నడుస్తున్నది కేవలం రాజకీయ నిరుద్యోగుల నిర్వహణలో పదవీ ప్రయోజనాల కోసం సాగిస్తున్న ఉద్యమంగా మారింది! అందుకే, లక్ష్యంలోనూ, ఆచరణలోనూ కూడా ఇరుప్రాంతాల సభల మధ్య అంత తేడా వచ్చింది. ఈ ఇరువర్గాల ఉద్యమాల మధ్య నినాదాలలో కూడా నేలకూ నింగికీ మధ్య ఉన్నంత తేడా స్పష్టంగా కన్పిస్తోంది!


 

"సీమాంధ్రులది ఒక సభా, పనికిమాలినది'' అని ఇటు రాజకీయ నిరుద్యోగుల ఉద్యమనాయకులు వర్ణిస్తుండగా, అటు సీమాంధ్ర ఉద్యోగసంఘాల "సమైక్యాంధ్ర'' ఉద్యమం "తెలుగుజాతి ఒక్కటిగా కలిసి ఉంటే'' సభ్యప్రపంచంలో ఇనుమడించిన వ్యక్తిత్వంతో "ఎగిసిపడుతుంది'' అని నినదించింది; రాష్ట్ర సమస్యలకు "మూడుప్రాంతాల ప్రజల మధ్య, ప్రజా ప్రతినిధుల మధ్య ప్రజాస్వామిక చర్చలే శరణ్య''మని చివరికి మావోయిస్టు పార్టీ సహితం ప్రకటిస్తుండగా అసలు "చర్చలే మాకొద్దు, లెక్కలూవద్దు, మా తెలంగాణా మాకివ్వండి'' అని వేర్పాటు ఉద్యమ నిరుద్యోగ నేతలు నినదిస్తున్నారు. సరిగ్గా ఈ సందర్భంగానే మూడు, నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి కె.సి.ఆర్. కాంగ్రెస్ నూ, అతడితో పోటీగా ఎక్కడ వెనుకబడి పోతామోనని ఇన్ని రోజులూ "ప్రత్యేక రాష్ట్ర'' నినాదంతో కదంతొక్కినా చంద్రబాబు పార్టీ సహా కొన్ని ఇతర పార్టీల రాజకీయ నిరుద్యోగులూ ఆశ్చర్యపడేలా ఒక ప్రకటన చేశాడు.


 

అసలు అదీ, ఇదీ కాదు "1956 నాటికి ఉన్న తెలంగాణా'' అంతా కావాలని, అంతకు మినహా మరొకటి తనకు ఇష్టంలేదనీ పాత 'దొర'స్వామ్యం రాచరికపు స్థాయిలో కెసిఆర్ ప్రకటించారు! అంటే, నిన్న మొన్నటి దాకా హైదరాబాద్ సహా 10 జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలన్న  కోరికపై ప్రారంభించి కొనసాగిస్తున్న "ఉద్యమాన్ని'' 1956కి ముందు, నిజాం పాలనలోనూ, 1953 నాటి హైదరాబాద్ స్టేట్ లో ఉన్న 16 జిల్లాలతో కూడిన తెలంగాణా కావాలని ఆయన కోరుతున్నాడన్న మాట, అప్పటిదాకా చెబుతున్న 10 జిల్లాలకు తోడు ఏనాడో హైదరాబాద్ స్టేట్ లో నిజాం-బ్రిటిష్ పాలకుల జమానాలో యుద్ధాలద్వారా, దురాక్రమణ పూరిత ఒడంబడికల ద్వారా కలుపుకున్న మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలు సహా అదే స్టేట్ లోని నిరంకుశ పాలన కింద విద్యకు, వికాసానికి దూరమై, అణచివేతలకు గురి అవుతూ వచ్చిన తెలుగు జిల్లాలని అర్థం!


 

అంటే, 1953లో కేంద్రప్రభుత్వం తెలుగుప్రాంతాలన్నింటిని [సీమాంధ్ర-నిజం ఆంధ్రుల జిల్లాలతో] విలీనంచేసి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పరచాలన్న సంకల్పంతో సమస్య పరిశీలనార్థం నియమించిన జస్టిస్ ఫజల్ ఆలీ కమీషన్ ను ఏర్పాటు చేయగా, ఆ కమీషన్ 1955 చివరి మాసాల కల్లా సమర్పించిన నివేదిక ప్రకారమే "ఆంధ్రప్రదేశ్'' ఏర్పడింది; ఆ నివేదిక ప్రకారమే భాషాప్రయుక్త రాష్ట్రాలా ప్రాతిపదికపైన హైదరాబాద్ స్టేట్ లో అంతవరకూ భాగమై ఉండి, కునారిల్లిపోతూ వచ్చిన మరాఠీ ప్రాంతాలూ, కన్నడ ప్రాంతాలూ ఎలాంటి వివాదాలూ లేకుండా అటు బొంబాయి రాష్ట్రంలోనూ, ఇటు కర్నాటక రాష్ట్రంలోనూ చేరి పునరావాసం పొందాయి! అలానే ఈ కమీషన్ నివేదిక ఆధారంగానే ఆంధ్ర-తెలంగాణాల విలీనం సందర్భంగా తలెత్తే సమస్యలేవైనా ఉన్నా, మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలలో విలీనమైన పూర్వపు హైదరాబాద్ స్టేట్ లో నిరంకుశ పాలన క్రింద మగ్గిపోతూ వచ్చిన మరాఠీ, కన్నడ ప్రాంతాలతో కూడా ఆ రెండు రాష్ట్రాలలో కొన్ని సమస్యలు రావచ్చుననీ, విశాల భాషాప్రయుక్త రాష్ట్రాలలో తలెత్తే సమస్యలు పరిష్కారానికి అతీతం కావనీ కమీషన్ స్పష్టం చేసింది.



 

కాని ఒక్క ఆంధ్ర-తెలంగాణాల విలీనీకరణ సందర్భంగానే కాలం చెల్లిన పాత ఫ్యూడల్ శక్తులకు ప్రతినిధులయిన కొందరు దొరలు, జాగిర్దార్లు, దేశ్ ముఖ్ లు పోతున్న పూర్వవైభవాన్ని మరచిపోలేక కాంగ్రెస్ లో దూరి ఆంధ్రప్రదేశ్ అవతరణకు అడ్డు కొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు! దాని ఫలితమే, వేర్పాటు ఉద్యమానికి పడుతూ వచ్చిన స్వార్థపూరిత బీజాలు! కెసిఆర్ మనస్సులో ఉన్న 1956కి ముందున్న "తెలంగాణా జిల్లాలు'' అంటే మనకు చెందని మరాఠా ప్రాంతాలూ లేదా కన్నడ ప్రాంతాలతో కూడిన పాత "హైదరాబాద్ స్టేట్'' అనే! ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అంతవరకూ నిజాముల ఏలుబడిలో పడి ఉన్న మరాఠా ప్రాంతాలైన ఉస్మానాబాద్, ఔరంగాబాద్, నాందేడ్, పర్బనీ, బీడ్ ప్రాంతాలు, కర్నాటకలో చేరిపోయిన బీదరు, రాయచోరు వగైరా ప్రాంతాలూ అన్నమాట!



 

ఇది యిలా ఉండగా అటు సీమాంధ్రలోని ఆంధ్రోద్యమానికి, ఇటు తెలంగాణలో మాడపాటి సురవరం, హయగ్రీవ చారి ప్రభృతులు, రావినారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఎస్.వి. ప్రసాద్ లాంటి కమ్యూనిస్టు యోధుల నాయకత్వాన నడిచిన ఆంధ్రోద్యమాలకు ఒక దశ వరకూ నిజాముల నిర్బంధకాండ మధ్య విజయవాడ కార్యక్షేత్రంగా ఉందన్న సత్యాన్నీ మరచిపోరాదు. ఈ పూర్వరంగాన్నంతనూ పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతనే ఫజల్ ఆలీ కమీషన్ హైదరాబాద్ ను సందర్శించి వివిధ సంస్థల, వ్యక్తుల అభిప్రాయాన్ని తెలుసుకుని వారినుండి భారీస్థాయిలో మహాబరులను స్వీకరించి, 1955 సెప్టెంబర్ 30న తన నివేదికను సమర్పించింది; "విశాలాంధ్ర ఏర్పాటునకు ఏకాభిప్రాయం బలంగా ఉన్నందున హైదరాబాద్ స్టేట్ ను విభజించడం సబబని కమీషన్ అభిప్రాయపడింది. అలాగే ఉభయ ప్రాంతాలకు చెందిన కొన్ని సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవచ్చుకో కూడా సిఫారసు చేస్తూ ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించింది :


 

"రెండువందల సంవత్సరాలనుండి దక్కను ప్రాంతానికి ఒక ప్రత్యేక సంస్కృతి ఏర్పడినందున, ఈ సంస్కృతే భారతదేశ ఐక్యతకు మిక్కిలి దోహదపడింద'ని చెబుతూ విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కొలదిమంది వేర్పాటువాద నాయకుల వాదాలను అప్పుడే కమీషన్ తోసిపుచ్చింది! అంతేగాదు, రాష్ట్ర ఐక్యత మాదిరిగానే హైదరాబాద్ రాష్ట్ర సంస్కృతి కూడా ఆనాటి పాలకులు విధి రాసిందే గాని మరొకటి కాదు కదా అని కమీషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే కమీషన్ తొలి ప్రాధాన్యతగా ఆంధ్ర-తెలంగాణాల విలీనీకరణనే కమీషన్ అభిలషించి బలంగా నివేదికలో పేర్కొంది. 'విశాలాంధ్ర' రాష్ట్రం ఏర్పాటు వల్ల వొనగూడే ప్రయోజనాల్ని స్పష్టంగా కమీషన్ యిలా వివరించింది :



 

"ప్రస్తుతపు ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణా విలీనమైతే కోట్లాది జనాభాతో పాటు విలువైన ముడిసరుకులు, కావలసినంత ఖనిజసంపద, ఎక్కువ జల, విద్యుత్ వనర్లు కల్గిన భూభాగంతో పెద్దరాష్ట్రం ఏర్పాటవుతుంది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర రాజధాని సమస్య కూడా పరిష్కారమై పోతుంది. విశాలాంధ్ర రాజధానిగా జంటనగరాలైన హైదరాబాదు, సికింద్రాబాదు చక్కగా సరిపోతాయి. విశాలాంధ్ర ఏర్పాటువల్ల కృష్ణా-గోదావరి నదీజలాల వినియోగం ఒకే అధికారం కిందికి వస్తుంది. వివిధ సాంకేతిక, పాలనాపరమైన కారణాల వల్ల జరిగిన సుదీర్ఖ కాలహరణం తర్వాత ఈ ప్రాజెక్టులు డెల్టా ప్రాంతంలో రూపుదిద్దుకోవలసి వచ్చింది. అయితే కృష్ణా-గోదావరి లోయల (బేసిన్స్) పూర్తీ ఏకీకరణ అసాధ్యం. ఈ నదీ ముఖద్వారాలలో ఉన్న తూర్పు ప్రాంతాలకు అభివృద్ధి పథకాలను రూపొందించడానికి, అమలు పరచడానికి గొప్ప అవకాశాలుంటాయి. విశాలాంధ్రలో భాగంగా తెలంగాణా ప్రాంతం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రయోజనాలు పొందుతుంది. కాబట్టి తెలంగాణాను ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఆంధ్రరాష్ట్రం, తెలంగాణా ప్రాంతాలకు కలిగే పరస్పర ప్రయోజనాలు కూడా ముఖ్యమైనవే. కరువు కాటకాది ఉపద్రవాలు వచ్చినప్పుడు తెలంగాణలో ఆహారకొరత ఉంటుంది. అయితే ఆంధ్రరాష్ట్రంలో ఎప్పుడూ అధికాహారోత్పత్తికి వీలుంటుంది కాబట్టి మిగులు ఉత్పత్తిని తెలంగాణా ప్రాంతానికి వాడుకోవచ్చు. ఇదే విధంగా ఆంధ్రరాష్ట్రంలో బొగ్గు వనరులు లేవు. వీటిని సింగరేణి నుండి ఆంధ్రరాష్ట్రానికి చేరవేయవచ్చు. పైగా ఆంధ్రరాష్ట్రంలో కలవడంవల్ల తెలంగాణాకు పరిపాలనా సంబంధమైన వ్యయం కూడా ఉండదు''


 

ఈ వాస్తవాలన్నింటిని 1969, 1970ల నాటి వేర్పాటువాద ఉద్యమాల సందర్భంగా తెలంగాణా రైతాంగ సాయుధపోరాట అగ్రనాయకులంతా గురించి, "విడిపోతే చెడిపోతాం'' అని ఆనాడే పదేపదే హెచ్చరించిన వాళ్ళని మరవరాదు, మరవరాదు! అందువల్ల "బొబ్బిలిదొర'' కెసిఆర్ 1956 నాటి హైదరాబాద్ స్టేట్ ను మొత్తంగా తెలంగాణా అని భావించుకుని మనవిగాని ఇతర నిజాం ఆక్రమిత జిల్లా ప్రాంతాలు కూడా కలిసిన తెలంగాణా ఏర్పడాలని కోరుకుంటున్నందున - ఆ ప్రతిపాదన కాంగ్రెస్ అధిష్ఠానం మెడకు తగిలిస్తున్న కొత్త 'ఉచ్చు' అవుతుంది! ఇది సమస్యలను పరిష్కరించడానికి కాదు, కొందరు భావిస్తున్నట్టు "తెలంగాణా రాష్ట్రం ఏర్పడకూడదని'' భావిస్తున్న వ్యక్తి అసలు కెసిఆర్ మాత్రమేనన్న అపవాదును అతను మీద మోసుకోక తప్పదు! చరిత్రలో తెలంగాణా రాష్ట్రమంటూ ఏనాడూ లేదు! ఉన్నదల్లా హైదరాబాద్ స్టేట్ లో తెలంగాణా ఒక భాగమేగాని, తెలంగాణా రాష్ట్రమనేది లేదు. కనుకనే మూడుప్రాంటలలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలూ, వాటిలోని బడుగు బలహీనవర్గాల ప్రయోజనాలకు పరిష్కారం ప్రభుత్వాల విధాన నిర్ణయాలే గాని ప్రాంతీయ వాదాలు కావు. ఆ వాదాలు ముందుకు రావడానికి అసలు కారణం - పెట్టుబడిదారీ, భూస్వామ్యవ్యవస్థలో దోపిడీ, అసమా ఆర్థికాభివృద్ధి దశలేనని మరవరాదు!