TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు.. మిస్టరీ ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం

Published on: Fri Mar 7, 2025 10:04AM

 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల మరణాలు మిస్టరీగా మారాయి. పోలీసులు సైతం ఈ మరణాల వెనుక వివేకా హత్య కేసులో నిందితుల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మరణించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారన్న వార్తలు వెలువడినప్పటికీ, రంగన్న భార్య మాత్రం తన భర్తతి సహజ మరణం కాదని అంటున్నారు. అలాగే ఇప్పటి వరకూ ఈ కేసులో నలుగురు సాక్షులు మరణించారు. ఇటీవల మరణించిన రంగన్న ఐదో వాడు. దీంతో పోలీసులు ఈ హత్యల వెనుక మిస్టరీని ఛేదించాలన్న నిర్ణయానికి వచ్చారు. కడప ఎస్పీ అశోక్ కుమార్ ఈ కేసులో సాక్షులు వరుసగా మరణిస్తుండటం వెనుక వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షుల మరణాల వెనుక నిందితుల హస్తం ఉందా అన్న కోణంలో  దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించారు. 

సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తన సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని తొలుత ప్రకటించినా, తరువాత అది హత్య అని తేలడంతో మాట మార్చి.. ఈ హత్య వెనుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ హస్తం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. తన సొంత మీడియాలో నారాసుర రక్త చరిత్ర అంటే కథనాలు ప్రచురించారు, ప్రసారం చేశారు. అప్పట్లో అంటే తాను విపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే 2019 ఎన్నికలలో విజయం సాధించి అధకారంలోకి వచ్చిన తరువాత సీబీఐ దర్యాప్తు అవసరం లేదంటూ మాటమార్చారు. అయితే వివేకా కుమార్తె డాక్టర్ సునీత పట్టువదలకుండా సీబీఐ దర్యాప్తును సాధించారు. 

సీబీఐ దర్యాప్తులో వివేకా హత్య వెనుక ఉన్నది సొంత మనుషులే అని దాదాపుగా తేలిపోయింది. దర్యాప్తు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని తేల్చింది. అయితే సీఎంగా జగన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి మరీ  సీబీఐ దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.  కోర్టు తీర్పు వెలువడకపోయినా.. వైఎస్ వివేకా హత్య వెనుక ఉన్న  పాత్రధారులు ఎవరు? సూత్రధారులు ఎవరన్న విషయంలో జనానికి ఒక క్లారిటీ వచ్చేశారు. అయితే ఈ కేసులో సాక్షుల వరుస మరణాలపై అనుమానాలు ముప్పిరిగొంటున్నాయి. 

గత ఐదేళ్లలో వివేకా హత్య కేసులో ఐదుగురు సాక్షులు మరణించారు. ప్రత్యక్ష సాక్షి, వైఎస్ వివేకా ఇంటి వాచ్ మేన్ రంగన్న బుధవారం (మార్చి 5) ఆస్పత్రిలో మరణించారు. తన భర్తది సహజమరణం కాదు అన్న రంగన్న భార్య ఫిర్యాదుమేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
కాగా తెలుగుదేశం సీనియర్ నాయకుడు, పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి కూడా రంగన్నది సహజమరణం కాదన్న అనుమానం వ్యక్తం చేశారు. తొలుత వైఎస్ మరణాన్ని గుండెపోటుగా నమ్మించడానికి ప్రయత్నించారు. అది కుదరకపోయే సరికి చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు రంగన్న మృతిపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని బీటెక్ రవి ఆరోపించారు. 

ఈ సందర్భంగా ఆయన పరిటాల రవి హత్య కేసులో సాక్షులు ఒకరి తరువాత ఒకరుగా అనుమానాస్పదస్థితిలో మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు కూడా మరణిస్తున్నారని రవి పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో సాక్షుల మరణాల మిస్టరీ నిగ్గు తేల్చాలని ఆయన విజ్ణప్తి చేశారు. కాగా జిల్లా ఎస్పీ కూడా వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు విస్తుగొల్పుతున్నాయని పేర్కొన్న సంగతి విదితమే. అంతే కాకుండా సాక్షుల మృతి వెనుక మిస్టరీని ఛేదించడానికి డిఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు.