ఏపీ కొత్త కేబినెట్ ముహూర్తం ఛేంజ్..
Published on: Thu Apr 7, 2022 11:04AM
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 11వ తేదీ ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే వేదిక కూడా ఎంపికయింది. వెలగపూడిలోని సచివాలయ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
కాగా.. కొత్త మంత్రులు ఎవరనేది ఇప్పటికి ఇంకా స్సష్టత రావడంలేదు. కానీ గురువారం కొత్త మంత్రులుగా ఎవరికి ఛాన్స్ లభిస్తుందనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలస్తోంది. మరో పక్కన గురువారం మధ్యాహ్యం మూడు గంటలకు ప్రస్తుత మంత్రిమండలి చిట్టచివరి సమావేశం జరుగుతుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం తరువాత ప్రస్తుత మంత్రిమండలి మొత్తం రాజీనామా చేస్తుంది. ఆ తరువాతే కొత్త మంత్రులు ఎవరనే తెలుస్తుందంటున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే కొందరికి సంకేతాలు వెళ్లాయని చెబుతున్నారు. అవకాశం ఉన్న వారు అందుబాటులో ఉండాలనే మెసేజ్ లు కొందరికి వెళ్తినట్లు తెలుస్తోంది. తొలి విడత మంత్రివర్గం మాదిరిగానే మలి విడతలో కూడా అనేక ట్విస్టులు ఉంటాయంటున్నారు. చివరి నిమిషం వరకు అనూహ్యంగా కొందరి పేర్లు మంత్రుల జాబితాలో తెర మీదకు వస్తాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లు కాకుండా కొత్త పేర్లు మంత్రులు జాబితాలో చూడవచ్చు అంటున్నారు. ఎవరూ ఊహించని వారు కూడా మంత్రులుగా ప్రమాణం చేయవచ్చు అనే గుససలు వినిపిస్తున్నాయి. చివరికి తెలుస్తున్నది ఏమిటంటే.. కొత్త మంత్రివర్గం మీద సీఎం జగన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు. ఏదేమైతేనేం మొత్తానికి కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. దీంతో ఆశావహుల్లోనూ పదవులు కోల్పోతున్న వారిలోనూ టెన్షన్ బాగా పెరిగిపోతున్నట్లు చెబుతున్నారు.


