TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఓటమెరుగని నేత ఇప్పుడు నిజంగానే సన్యాసం తీసుకోబోతున్నారా?

Published on: Fri Oct 11, 2019 11:28AM

 

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పరుచూరు నియోజకవర్గంలో తిరుగులేని నేత. నిన్నటి వరకూ ఓటమెరుగని నేతగా ఉన్న దగ్గుబాటి మొన్నటి ఎన్నికల్లో తొలి సారి ఓడిపోయారు. వైసిపి అధికారంలోకి రావడంతో పరుచూరు నియోజకవర్గ ఇన్ చార్జి గా కొనసాగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను తనదైన శైలిలో ముందుకు తీసుకు పోతున్నారు. అవినీతి మరక అంటని నేత అయిన దగ్గుబాటికి ఇప్పుడు ఓ సమస్యొచ్చి పడింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన రాజకీయాల్లో కొనసాగే విషయం పై చాలాసార్లు తర్జన భర్జన పడ్డారు అని తెలుస్తోంది.ముప్పై అయిదేళ్లుగా తిరుగులేని నేతగా ఉన్న ఆ సీనియర్ నేతకు సమస్యొచ్చిపడింది. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటికే ఓసారి రాజకీయ సన్యాసం చేసిన ఆయన మరోసారి అదే అస్త్రం ప్రయోగించ పోతున్నారా లేక వారసుడి  కోసం సర్ధుకుపోతారా అనే అంశం పై చర్చ కొనసాగుతోంది.

ఇటీవల నియోజక వర్గ రాజకీయ సమీకరణాల కూడా మారాయి. దగ్గుబాటికి తెలీకుండా పార్టీ నిర్ణయాలు జరగడంతో ఆయన మనస్తాపం చెందారని సమాచారం. అయితే పార్టీ అధిష్టానం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జోక్యంతో కొన్ని వివాదాలు అక్కడితో సర్ధుమనిగాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ తో దగ్గుబాటి ఇటీవల భేటీ అయ్యారు. ఆయన నియోజక వర్గ సమస్య లతో పాటు తన మనసులో మాట ఆయన ముందు పెట్టారు.భర్త ఒక పార్టీ భార్య ఒక పార్టీలో ఉండడంతో రాజకీయంగా సమస్యలొస్తున్నాయి. పురంధేశ్వరి ఇటీవల కాలంలో వైసిపి సర్కార్ పై విమర్శలు చేశారు. దీంతో దగ్గుపాటి టార్గెట్ గా మారారు. ఆయనపై పార్టీ నేతలే విమర్శ లు చేయడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో కూడా సమస్య లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. 

తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తన కొడుకు హితేష్ రాజకీయాల్లో కొనసాగుతారని జగన్ తో భేటీలో దగ్గుబాటి తన భావాన్ని వెల్లడించారు. అయితే జగన్ మాత్రం దగ్గుబాటికి సర్దిచెప్పారట. ఇప్పటి కిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సమాధానమిచ్చారు జగన్. దగ్గుపాటి వెంకటేశ్వరావు ఇప్పటికే  ఒకసారి రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా కొడుకు హితేష్ కు పౌరసత్వం సమస్య రావడంతో దగ్గుబాటి రంగంలోకి దిగారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోగా తాజా రాజకీయ పరిణామాలతో మరోసారి దగ్గుబాటి రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం. మొత్తానికీ దగ్గుబాటి పాలిటిక్స్ కు దూరంగా జరగడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. త్వరలోనే దగ్గుపాటి పరుచూరు లో అనుచరులు అభిమాను లతో సమావేశం కాబోతున్నారని తెలుస్తుంది. ఈ మీటింగ్ లో దగ్గుబాటి తన రాజకీయ సన్యాసంపై ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకీ పురందేశ్వరి రాజీనామా చేసే అవకాశం అవసరం లేదు. దీంతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందన్న భావనలో దగ్గుబాటి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక రాజకీయాల్లో దగ్గుబాటి కనిపించే అవకాశాలు తక్కువ అని సమాచారం. ఇక ఈ ఇంటి రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయో వేచి చూడాలి.