TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కస్టోడియల్ డెత్ వివాదం: కూటమి నేతల తీరుపై మండిపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు!

Published on: Sat Jun 20, 2026 3:32PM

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

విజయవాడలో చోటుచేసుకున్న సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం  వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. పోలీస్ కస్టడీలోనే ఈ ఘోరం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో, ప్రభుత్వంపై విమర్శల దాడి పెరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదంతాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం అలసత్వాన్ని సహించేది లేదని, బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టటే   ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ తర్వాత అతను అనుమానాస్పద రీతిలో అదృశ్యం కావడం, అతని మృతదేహం కూడా లభించకపోవడంతో ఇది కస్టోడియల్ డెత్   అనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. పోలీసులు విచారణ పేరిట థర్డ్ డిగ్రీ ఉపయోగించి, అతడి మరణానికి కారణమయ్యారంటూ బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధితుడు ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది.

ఈ సున్నితమైన ఉదంతంపై అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.  

మరోవైపు, ఈ దురదృష్టకర ఘటనను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యవ్యమవుతోంది. ఒక వ్యక్తిగత కేసును లేదా కొందరు పోలీసులు చేసిన అతిని మొత్తం ఒక సామాజిక వర్గంపై జరిగిన దాడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ రాజకీయ నాయకుడు సాంబశివరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన  సామాజిక వర్గాల ముసుగులో చేసే రాజకీయాలు సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తాయని  హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం సాయికృష్ణ అసలు ఎక్కడున్నాడు? సజీవంగా ఉన్నాడా లేదా అనే కోణంలో నిష్పక్షపాత విచారణ జరగాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే పోలీసుల వైఫల్యం ఉంటే వారిని కోర్టుకు అప్పగించి కఠినంగా శిక్షించడమే ఏకైక మార్గమన్నారు. సమాజంలో అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన సామాజిక వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోకుండా, ప్రజలు కూడా చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం త్వరితగతిన ఈ కేసుపై స్పష్టతనిచ్చి బాధితులకు న్యాయం చేయడమే కాకుండా, శాంతిభద్రతలను కాపాడటంలో తన నిబద్ధతను నిరూపించుకోవాల్సి ఉందన్నారు.