పెద్ద నోట్ల రద్దు... మహిళ ఆత్మహత్య..

 

రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయంతో జనజీవనం స్థంభించినపోయింది. పెద్ద నోట్లు రద్దుతో చిల్లర కోసం జనాలు ప్రాకులాడుతున్నారు. అంతేకాదు తమ వద్ద నోట్లను మార్చుకోవడానికి ఇప్పటికే జనాలు క్యూలు కడుతున్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు ఈ టెన్షన్ వల్ల ఓ మహిళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని శెనగపురంలో కందుకూరి వినోద (55) అనే మహిళ తమ వద్ద ఉన్న రూ. 54 లక్షలు చెల్లవన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. తమకు ఉన్న 12 ఎకరాల భూమిని రూ. 56.40 లక్షలకు ఆమె అమ్మేసింది. అందులో భర్త వైద్యానికి రూ. 2 లక్షలు ఖర్చు చేసింది. మిగిలిన రూ. 54 లక్షలతో వేరే ప్రాంతంలో భూమి కొనేందుకు యత్నిస్తోంది. ఈ సమయంలో... పెద్ద నోట్లు రద్దయిపోయాయని, ఈ నోట్లన్నీ చిత్తు కాగితాలతో సమానమని ఆమెకు ఎవరో చెప్పారు. అంతేకాదు చెప్పినా వినకుండా భూమి అమ్మేశావంటూ కొడుకు,భర్త కూడా ఆమెపై కోప్పడటంతో.. నిజంగానే డబ్బులు చెల్లవేమోనని భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.