TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అగ్రెసివ్ పంథాతో పాత కల్ట్ పవన్ కనిపిస్తున్నారు!

Published on: Tue Jun 23, 2026 4:10PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకినాడ వేదికగా ఇటీవల  జరిగిన 'మా ఊరు - మాటామంతి' కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన అత్యంత అగ్రెసివ్ టోన్‌లో హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నాయకులు పరిధులు దాటి మాట్లాడుతున్నారని, భవిష్యత్తులో ఏం జరిగినా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు. 

గత కొన్ని రోజులుగా   సాయికృష్ణ మిస్సింగ్ ఉదంతం నేపథ్యంలో కాపు సామాజిక వర్గ  ఓట్ బ్యాంక్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు చేస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. తాను కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, ఒకవేళ భవిష్యత్తులో (రెండేళ్లల్లోనో, మూడేళ్లల్లోనో) వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా సరే.. ఒక్కొక్కరిని తొక్కి నారతీస్తానంటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వేనుక రాజకీయ వ్యూహం ఏమిటన్న దానిపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో..ప్రముఖ అనలిస్ట్ భరధ్వాజ లోతైన విశ్లేషణ చేశారు. 

 పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా..  కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్   పంపించారన్నారు.  తాను ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ధోరణి సూచిస్తోందని భరద్వాజ అన్నారు.

మరోవైపు, పవన్ కళ్యాణ్ తనను పదేపదే కాపు సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేయవద్దని వైసీపీ నేతలకు గట్టిగా చెప్పారు. తాను కులాలకు అతీతుడిననీ, ప్రాంతీయవాదానికి అతీతంగా జాతీయ సమగ్రత కోసం పనిచేస్తానని పునరుద్ఘాటించారు. జనసేన పార్టీని ఐదు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఢిల్లీలో జెండా ఎగరేయబోతున్నామని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని భరద్వాజ అన్నారు. అదే జరిగితే.. రాష్ట్రంలో ఆయన సోదరుడు నాగబాబుకు కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందన్నారు. 

ఈ పరిణామాలు కూటమి ప్రభుత్వంలోనూ చర్చకు దారితీస్తున్నాయి. గతంలో హోంమంత్రి అనిత పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి సభలోనూ ఆయన  నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉండేవి కానీ నేను తీసుకోను' అని వ్యాఖ్యానించడం విశేషం. ఈ దూకుడు వ్యవహార శైలి    కల్ట్  పవన్ కళ్యాణ్‌ను తలపిస్తోందని, నిస్తేజంగా ఉన్న జనసైనికుల్లో మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపేందుకే ఆయన ఈ తరహా అగ్రెసివ్ పంథాను ఎంచుకున్నారనీ భరద్వాజ విశ్లేషించారు.