కడప కాంగ్రెస్ లో కల్లోలం
Published on: Fri Apr 13, 2012 10:29AM
కడప జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా వారెవరూ పార్టీ బలోపేతానికి కృషి చేయటం లేద్దని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు వీరి మధ్య ఉన్న విభేదాల కారణంగా పార్టీ పరువు బజారుపాలవుతోంది, నిత్య అసంతృప్తివాడిగా పేరుపొందిన డి.ఎస్.రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రిపై ఉన్న కోపంతో జిల్లాలో పార్టీని గాలికి వదిలేశారు. త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో తనకు ఎటువంటి సంన్ధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. మంత్రి అహ్మదుల్లా అందరితో మంచిగా ఉండడం తప్ప పార్టీ పటిష్టతకు ఎటువంటి చొరవా చూపడం లేదు.
ఆయన ఎప్పుడూ తనగోల ఏదో తనది అన్నట్లు వ్యవహరిస్తుంటారే తప్ప కార్యకర్తలను పెద్దగా పట్టించుకోరన్న అపవాదు ఉంది. ఇటీవల మంత్రి పదవి పొందిన రామచంద్రయ్యకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు తీవ్ర గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. పి.ఆర్.పి.నుంచి వచ్చిన తనను కానీ, ఇతర నాయకులను కానీ జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవటం లేదని ఆయన బహిరంగంగానే వాపోతున్నారు. ఇక 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి కూడా జిల్లా పార్టీలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయటం లేదు. వైఎస్ వివేకానందరెడ్డి గత ఏడాది ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తన వదినపై పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఆయనను జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదు. ఆయన జిల్లాలో ఏనాడూ జగన్ గురించి విమర్శించలేదు. అంతేకాకుండా పార్టీలో ఎవరైనా వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శిస్తే ఒప్పుకునేది లేదని బహిరంగంగానే హెచ్చరించారు. ఈ నాయకుల వైఖరితో కడపజిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి చాలా బలహీనపడింది.


