TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎస్కే మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్న ధోని..?

Published on: Wed May 27, 2026 8:48PM

 

చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ నాటికి సీఎస్కే‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్నాడా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ధోని భవిష్యత్తుపై సీఎస్కే జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ చేసిన సంచలన ప్రకటన దానికి ఊతమిస్తోంది.  సీఎస్కే జట్టు అనగానే గుర్తుకు వచ్చే పేరు ఎంఎస్ ధోని. సీఎస్కే అంటే ధోని.. ధోని అంటే సీఎస్కే అనే అంతలా మారింది.. ఆ జట్టు పరిస్థితి. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు సార్లు టైటిల్ అందించడంలో ఈ మిస్టర్ కూల్ ప్రధాన పోషించాడు. 

మోకాలి గాయం కారణంగా ధోనీ ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేకపోయాడు. దీంతో ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగిసిపోయిందనే చర్చలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ.. ధోనీ జట్టులో ఏ పాత్రలో ఉండాలనుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అది పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ధోనీ సీఎస్కే జట్టులోనే శాశ్వతంగా కొనసాగాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ధోనీ సీఎస్కేలో ఏ పాత్రలో ఉన్నా మాకు ఆనందమే. ధోని ఆటగాడిగా ఉంటాడా, కోచ్‌గా మారతాడా లేదా మెంటార్‌గా సేవలందిస్తాడా అనేది పూర్తిగా అతడి ఇష్టం. సీఎస్కేకు సంబంధించిన ఏ నిర్ణయమైనా ధోనీ అభిప్రాయం పైనే ఆధారపడి ఉంటుందని సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. ధోనీ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ.. వచ్చే సీజన్ నాటికి ఎంఎస్ ధోనీ సీఎస్కే మేనేజ్‌మెంట్‌లో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ఊహాగానాలకు సీఎస్కే సీఈవో వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి.