ఒక వైపు విమర్శలు.. మరో వైపు వినతులు..!

posted on: Jun 24, 2022 7:00AM

దేశంలోని రాజకీయ పార్టీలలో  టీఆర్ఎస్ శైలే భిన్నం. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి.. రాజకీయం ఇప్పటి దాకా అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్న ధోరణిలోనే సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన సమయంలో కుటుంబ సమేతంగా సోనియాగాంధీని కలిసి కృతజ్ణతలు తెలిపిన తెరాస అధినేత కేసీఆర్.. ఆ తరువాత ఎన్నికల సమయంలో ఆ పార్టీపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి విదితమే. ఆ తరువాత కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా బీజేపీకి బాసటగా నిలిచిన కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీపై కారాలూ, మిరియాలూ నూరుతూ ఘాటు విమర్శలు చేస్తున్న సంగతీ తెలిసిందే. ఆయన కుమారుడు.. తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.

తెలంగాణ గడ్డపై బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్ హస్తిన వెళ్లి కేంద్ర మంత్రులకు రాష్ట్రానికి నిథుల కోసం వినతుల మీద వినతులు సమర్పిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ధోరణి మరింత ఎక్కువైంది. తెలంగాణ గడ్డపై కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణకు ఇచ్చింది శూన్యమంటూ విమర్శలు గుప్పిస్తూ.. ఢిల్లీ వెళ్లి కేంద్రం మంత్రులతో ప్రత్యేక భేటీలు అవుతున్నారు.

మోడీ హయాంలో తెలంగాణకు ప్రతి విషయంలోనూ అన్యాయమే జరిగిందని ఆరోపిస్తున్న ఆయన అవకాశం దొరికితే హస్తినలో వాలిపోయి కేంద్ర మంత్రులతో సమావేశమౌతున్నారు. ఇటీవలే ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖరత్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని విజ్ణప్తి చేసి వచ్చారు. వచ్చీ రాగానే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంలో బిజీ అయిపోయారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయం, నిధులు మంజూరు చేయకపోవడంపై దుమ్మెత్తి పోశారు. ఆ వెంటనే హుటాహుటిన హస్తినలో వాలిపోయిన ఆయన కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. హైద‌రాబాద్ డ్రైనేజీ సిస్టమ్‌, రోడ్ల నిర్మాణంకు ఆర్థిక సాయం చేయాల‌ని విజ్ణప్తి చేశారు.

వినతి పత్రం సమర్పించారు. కేంద్రం ఎన్నిసార్లు కోరినా పైసా విదల్చడంలేదని ఒక వైపు విమర్శలు గుప్పిస్తూనే.. మళ్లీ మళ్లీ కోరడం ఎందుకు అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.కేటీఆర్ హస్తిన పర్యటనలపై రాజకీయ పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం మోడీకి ఎదురు పడటానికి సైతం ఇష్టపడకపోగా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా జాతీయ పార్టీని ప్రారంభించనున్నారు.

మరో వైపు ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం తరచుగా హస్తిన యాత్రలు చేస్తూ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహిస్తున్నారు.  ఇదేం రాజకీయం తిరుమలేశా అంటే జనం అచ్చెరువొందుతున్నారు. తండ్రీ కొడుకుల భిన్న వైఖరులపై తెరాస శ్రేణుల్లోనే అయోమయం నెలకొంది. ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...