క్రిమినల్... కాల్చిపారేశారు!!

 

హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్ దగ్గర ఒక క్రిమినల్ని పోలీసులు కాల్చి చంపేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన శివకుమార్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక దొంగతనాలు చేసిన గజదొంగ. ఇతని మీద 300 పైగా చైన్ స్నాచింగ్ కేసులున్నాయి. ఇతని కోసం పోలీసులు ఎంతోకాలంగా వెతుకుతున్నారు. శుక్రవారం రాత్రి ఔటర్ రింగ్‌రోడ్ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ వుండగా అక్కడకు బైక్ మీద వచ్చిన శివకుమార్ పోలీసుల మీద దాడి చేశాడు. ఒక ఇన్‌స్పెక్టర్‌ని కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. దాంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం శివకుమార్ మీద కాల్పులు జరపగా అతను అక్కడికక్కడే మరణించాడు. నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం ఆర్మేనిపాడు గ్రామానికి చెందిన శివ చైన్‌ స్నాచింగ్‌లు, ఇళ్ళలో దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తుడు. ఈమధ్య కాలంలో హైదరాబాద్‌లో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన రెండో క్రిమినల్ శివకుమార్. మొన్నీమధ్య హైదరాబాద్ శివార్లలోనే ఒక దొంగనోట్ల ముఠాకు చెందిన క్రిమినల్ని పోలీసులు కాల్చి చంపారు.