TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటుడు ప్రకాశ్ రాజ్‌పై క్రిమినల్ కేసు!

Published on: Tue Jun 16, 2026 10:43AM

ప్రముఖ  నటుడు ప్రకాశ్ రాజ్‌ పై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. శ్రీరాముడు, హిందూ దేవతలు,   రామాయణంపై  ప్రకాశ్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ తిరుపతి కోర్టులో ఆయనపై  తిరుపతిలోని నాలుగవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్  కోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది.

బీజేపీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు  భానుప్రకాష్ రెడ్డి తన న్యాయవాది కొత్తపల్లి అజయ్ కుమార్‌తో కలిసి సోమవారం (జూన్ 15) కోర్టులో ఈ ప్రైవేటు కేసును దాఖలు చేశారు. 

గతంలో కేరళలో జరిగిన  కేరళ లిటరేచర్ ఫెస్టివల్ తో పాటు పలు బహిరంగ వేదికలపై ప్రకాశ్ రాజ్ రామాయణం, శ్రీరాముడు, లక్ష్మణుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన శ్రీరాముడు, లక్ష్మణుడు దక్షిణాదిపై అంటే శ్రీలంకపై దండయాత్ర చేశారంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు భాను ప్రకాశ్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్ కావడంతో భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. అప్పట్లోనే ప్రకాశ్ రాజ్‌కు లీగల్ నోటీసులు పంపి, హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు గానూ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే..  ఆ నోటీసులపై ప్రకాశ్ రాజ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.   భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని,   రామాయణాన్ని ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా ఉన్నాయని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.

 భారతదేశ సాంస్కృతిక, మతపరమైన ఐక్యతను దెబ్బతీసేలా ప్రకాశ్ రాజ్ ఆర్య, ద్రవిడ  సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారని, ప్రాంతీయ విద్వేషాలను, మతపరమైన విభేదాలను రగిల్చేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని  వివరించారు. 

కోర్టు ఆవరణలో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్రంగా గాయపరిచాయి. తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పమని నోటీసులు ఇచ్చినా ఆయన అహంకారంతో సమాధానం ఇవ్వలేదు కనుకనే.. చట్టం ద్వారా ఆయనకు బుద్ధి చెప్పేందుకు కోర్టులో ప్రైవేట్ కేసు వేసినట్లు చెప్పారు.  

తిరుపతి నాల్గవ అదనపు కోర్టు ఈ ప్రైవేట్ ఫిర్యాదును విచారణకు స్వీకరించింది. త్వరలోనే ఈ కేసుపై కోర్టు విచారణ జరిపి ప్రకాశ్ రాజ్‌కు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.