చంద్రబాబు, కేసీఆర్, జగన్ ఏకం కావాలి.. మోదీకి నామాలే

 

సీపీఐ సీనియర్ నేత నారాయణ.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. లౌకిక విధానాలతో కూడిన ఫ్రంట్ దేశానికి అవసరమని, అందుకోసం చంద్రబాబు, కేసీఆర్, జగన్ ఏకం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మే 23 తర్వాత నరేంద్ర మోదీకి మూడు నామాలే మిగులుతాయని ఎద్దేవా చేశారు.

గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నారాయణ విమర్శించారు. నెలకు మేకప్‌ కోసం రూ. 80 లక్షలు ఖర్చు చేస్తున్న మోదీ చాయ్ వాలానా? అని నిలదీశారు. పుల్వామాలో జవాన్లపై జరిగిన దాడి సర్కారీ హత్యేనని ఆరోపించారు. నిఘా సంస్థలు హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం వల్లే జవాన్లు ప్రాణాలు కోల్పోయారని నారాయణ అన్నారు.
 
సీబీఐ, ఆర్బీఐ, ఈసీ లాంటి స్వయంప్రతిపత్తి గల సంస్థలను కేంద్ర ప్రభుత్వం నడిరోడ్డులో బట్టలు లేకుండా నిలబెట్టిందని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో అప్రకటితంగా కేంద్రమే పాలిస్తోందన్నారు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత మోదీ ఇక సినిమాల్లో నటించాల్సిందేనని ఎద్దేవా చేశారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎన్నికల్లో పోటీకి అనర్హురాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమెపై బహిష్కరణ వేటు వేయాలని నారాయణ డిమాండ్ చేశారు.