దేశంలో జనవరి 16 నుంచి కోవిడ్ టీకా పంపిణీ

భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. దేశంలో జనవరి 16 నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారంలో మకర సంక్రాంతి, లోహ్రి, మగ్‌ బిహు తదితర పండగలను దృష్టిలో పెట్టుకుని జనవరి 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించామని కేంద్రం  తెలిపింది.  ప్రాధాన్యత క్రమంలో భాగంగా మొదట దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. ఆ తర్వాత 27కోట్ల మంది 50ఏళ్ల పైబడిన లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50ఏళ్ల లోపు వారికి కోవిడ్ అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్ పై డిజిటల్ పర్యవేక్షణ చేయనున్నారు. 

 దేశంలో కరోనా పరిస్థితులు, కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ  కేబినెట్‌ సెక్రటరీ, పీఎం ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం కేంద్రం ఈ ప్రకటన చేసింది.  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా పంపిణీ సన్నాహాల గురించి ఈ సమావేశంలో ప్రధాని మోడీ.. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.రెండు స్వదేశీ టీకాల అత్యవసర వినియోగానికి కేంద్రం ఇటీవల అనుమతులు మంజూరు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్ట్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ టీకాలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వ్యాక్సిన్‌ పంపిణీ కోసం శుక్రవారం  దేశవ్యాప్తంగా డ్రైరన్‌ చేపట్టింది. ఈ డ్రై రన్‌ ఫలితాల ఆధారంగా టీకా పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దేశ వ్యాప్తంగా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీకి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌గౌబ అన్ని రాష్ట్రాల  ప్రధాన కార్యదర్శులకు విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే దేశంలోని అన్ని  ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ విజయవంతమైందని తెలిపారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించిన రాజీవ్‌గౌబ .. వ్యాక్సిన్‌ పంపిణీని ప్రణాళిబద్దంగా అమలు చేయాలని కోరారు. మొదటగా  ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లోని హెల్త్‌ వర్కర్స్‌, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు, 50 సంవత్సరాలు పై బడిన వారికి ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని సూచించారు.