TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో కరోనా.. విశాఖలో తొలి కేసు నమోదు

Published on: Fri May 23, 2025 10:25AM

నాలుగేళ్ల కిందట కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. 2019లో మొదలై 2021 వరకూ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మూడు దశలుగా విస్తరించి, వ్యాపించి లక్షల మంది ఉసురు తీసింది. ఇప్పుడు మరోసారి తన పంజా విసరడానికి రెడీ అయిపోయింది. గత వారం పది రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో అయితే కేరళలో ఈ మహమ్మారి వ్యాప్తి వేగంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి.

ఈ తరుణంలో తాజాగా ఏపీలో   క‌రోనా పాజిటివ్‌ కేసు న‌మోదైంది. విశాఖ జిల్లా మద్దెలపాలెంలో ఒక వివాహితకు కరోనా పాజిటివ్ వచ్చిందనీ,  రాష్ట్రంలో ఇదే తొలి కేసు అని ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఆ తరువాత ఆమె భర్త, ఇద్దరు పిల్లలకూ కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. వారికి చికిత్స అందించి కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉంచనున్నారు.  కరోనా వ్యాప్తి నిరోధక చర్యలలో భాగంగా పాజిటివ్ వచ్చిన కుటుంబం నివసిస్తున్న ప్రాంతంలో  ఇంటింటికి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

అంతే కాకుండా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుంపులుగుంపులుగా కూడవద్దనీ,   రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్ పోర్టులు, కోవిడ్  నియమావళి  పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, 60 ఏళ్లు దాటిన వారు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఉండాల‌ని ప్రభుత్వం పేర్కొంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనలు, మార్గ దర్శకాలను తు.చ. తప్ప కుండా పాటించాలని ఆదేశించారు.