ఏపీలో కరోనా విజృంభణ.. సర్కార్ అలర్ట్.!
Published on: Fri Jul 17, 2026 12:22PM
.webp)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతి పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. గత నెల 1నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 340కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కోవిడ్ వ్యాప్తి తీవ్రత ఒకింత పెరిగింది. రాష్ట్రంలో గత 20 రోజుల్లో 13కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు.
కడప జిల్లాలో అత్యధికంగా 8 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో 3, విశాఖపట్నంలో 1, కాకినాడలో 1 కేసు నమోదయ్యాయి. ప్రస్తుతానికి కోవిడ్ బారిన పడిన వారిలో ముగ్గురు రోగులు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరే కాకుండా, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మహిళకు కూడా కరోనా పాజిటివ్గా తేలడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ ఏ రకానికి చెందినది, కొత్త వేరియంట్లు ఏవైనా పుట్టుకొచ్చాయో తెలుసుకోవడానికి బాధితుల నుంచి సేకరించిన శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపించారు.
రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిపై తక్షణమే స్పందించి, ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, తగినన్ని కోవిడ్ నిర్ధారణ పరీక్షల కిట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
Chandrababu Naidu covid review, Kadapa corona cases, AP covid deaths, corona virus cases in India


