నరసరావుపేట డీఎస్పీ, ప్రభుత్వ వైద్యుడికీ కోర్టు నోటీసులు
Published on: Sun Sep 11, 2022 10:28AM
ఎవరిమీదయినా కక్ష తీర్చుకోవాలంటే కుట్రపన్ని కొట్టించడం, కేవలం ఆస్పత్రి లో చేరేలాగా చేయడమే చేసి ఆనందించడం గమనిస్తుంటాం. కానీ సినిమాటిక్ గా కొట్టినట్టు సీన్ క్రియేట్ చేసి మరీ పోలీసు కేసు, జైల్లో పెట్టించడాలు కూడా చేయవచ్చని నరసరావుపేట సంఘటన తెలియజేసింది. ఏకంగా న్యాయమూర్తే ఆశ్చర్యపడేలా జరిగింది.
రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెంలో గత నెల 27న గంగినేని పున్నయ్య అనే వ్యక్తి తనపై గొడ్డలితో దాడిచేశాడని అదే గ్రామా నికి చెందిన తురిమెల్ల చెంచారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పున్నయ్యమీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
నరసరావుపేట ప్రభుత్వఆస్పత్రిలో చెంచారావు చికిత్స పొందారు. తీవ్రగాయాలు అయినట్టు ఆ ఆస్ప్రతి వైద్యుడు రాజశేఖర్ రిపోర్టు కూడా ఇచ్చారు. వినడానికి ఇదంతా బాగానే ఉంది. ఇదంతా నిజమే అయ్యో ఎంతగా గాయపడ్డాడో చెంచారావు అను కున్నారంతా. డాక్టర్గారి నివేదిక అంతలా ప్రభావం చూపిందిమరి.
శనివారం చెంచారావు కేసు కోర్టుకి వచ్చింది. చెంచారావు దెబ్బలను జడ్జి స్వయంగా పరిశీలించాలనుకున్నారు. చిత్రమేమంటే ఆయనకు చెంచారావు ఒంటి మీద ఒక్క గాయం కనిపించకపోవడం. అసలు కత్తిపోట్లు ఎక్కడున్నాయి, చిన్న గాయం కూడా లేని మనిషికి తీవ్రగాయాలకు చికిత్స చేశామంటూ డాక్టరు రిపోర్టు ఇవ్వడమేమిటని జడ్జిగారు ఆశ్చర్యపడ్డారు. నిందితుడుకి బెయిల్ రాకుండా కావాలనే తప్పుడు రిపోర్టు ఇచ్చినట్లు ధ్రువీకరించుకున్న జడ్జి వెంటనే పున్నయ్య కి బెయిల్ మంజూరు చేశారు. జరిగిన ఘటనపై పది రోజుల్లో సమాధానం చెప్పాలని డీఎస్పీ కి, ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర్ కి నోటీసులు ఇచ్చారు.


