TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తలసాని వారి కన్ఫ్యూజనేంటో...!

Published on: Fri Nov 13, 2015 9:28AM

 

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర రాజకీయాలలో క్రియేట్ చేసిన కన్‌ఫ్యూజన్ తలలు పండిన రాజకీయ పరిశీలకులకే అర్థం కాని విధంగా వుందని విశ్లేషకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా శాసనసభకు ఎన్నికైన ఆయన ఆ తర్వాత ఎంచక్కా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేసి టీఆర్ఎస్‌లో చేరిపోయి మంత్రి అయ్యారు. అయితే ఆయన రాజీనామా విషయమే అంతు చిక్కకుండా వుంది. ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేశారని, ఆ రాజీనామా లేఖను స్పీకర్‌కి ఇచ్చారని అంటారు. స్పీకర్ కార్యాలయమేమో రాజీనామా మా దగ్గర లేదని అంటుంది. అయితే ఆ లేఖను స్పీకర్ తన దగ్గరే ఉంచుకున్నారన్నమాట అని ఎవరికి వారు సమాధానం చెప్పుకుంటున్న పరిస్థితి. ఆయన రాజీనామా చేసి చాలా నెలలు అయిపోయినప్పటికీ ఆ రాజీనామాను స్పీకర్ ఎందుకు ఆమోదించడం లేదనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఒక ఎమ్మెల్యే చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించకుండా ఎందుకు తనదగ్గరే వుంచుకున్నారన్న ప్రశ్నకు ఎవరి నుంచీ సమాధానం లభించడం లేదు. ప్రతిపక్షాలేమో రాజీనామా చేసిన వ్యక్తి ఇంతకాలం మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం అని మొత్తుకుంటున్నాయి. అయితే ఆ మొత్తుకోళ్ళను వినేవాళ్ళు ఎవరూ కనిపించడం లేదు. రాజ్యాంగంలో వున్న లొసుగులను, స్పీకర్‌కి వుండే విశేషాధికారాలను అధికార పార్టీ చాలా చాకచక్యంగా వినియోగించుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పౌరుడు కోర్టులో వేసిన కేసు ఈ అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చేలా వుంది. అసలు తమరి విషయం మీద క్లారిటీ ఇస్తారా అంటూ కోర్టు తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులకు తలసాని ఇచ్చే సమాధానం అయినా ఈ విషయంలో రాజకీయ వర్గాల్లో నెలకొన్న కన్ఫ్యూజన్ని తొలగిస్తుందని ఆశించాలని పరిశీలకులు అంటున్నారు.