విద్యార్థిపై దంపతుల దాడి.. కాళ్ళు పట్టుకున్నా వదల్లేదు!

హైదరాబాద్ లోని సనత్ నగర్  ప్రభుత్వ పాఠశాల సమీపంలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులపై ఓ దంపతులు దాడికి తెగబడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిపై ఓ మహిళ దారుణంగా ప్రవర్తించింది. అమానుషంగా దాడి చేసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రౌండ్ టేబుల్  ఆడుకుంటూ ఉండగా అటునుంచి ఓ జంట వెళ్తోంది. ఆడుకుంటున్న విద్యార్థులలో ఒక విద్యార్థి అనుకోకుండా వెళ్లి ఆ దంపతులకు తగిలాడు. అంతే, ఆ విద్యార్థిపై భార్యాభర్త విచక్షణా రహితంగా దాడి చేశారు. 

ఇది చూసిన విద్యార్థి  స్నేహితుడు వచ్చి కొట్ట వద్దూ ఏం చేయలేదు అంటూ వారిని బతిమిలాడాడు. అదే సమయంలో బాధిత విద్యార్థి దంపతుల కాళ్ళు పట్టుకున్నాడు. అయిన వారు కనికరించలేదు. కొట్టిందికాక, లేబర్ పిల్లలు.. చిల్లర గాళ్లు అంటూ పైగా విద్యార్థులపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ విజువల్స్ చూశాక పోలీసులకు అసలు విషయమేంటో అర్థమైంది. విద్యార్థులపై దాడి చేయటమే కాకుండా ఫిర్యాదు చేసిన దంపతులపై పోలీసులు కేసు పెట్టారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.