ఫ్రాన్స్ లో మొదలైన కరోనా సెకండ్ వేవ్.. గడప దాటాలంటే పర్మిషన్ కావాల్సిందే

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ యూరప్ లో మొదలైంది. తాజాగా ఫ్రాన్స్ దేశంలో కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలవడంతో ఫ్రాన్స్ మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించింది. దేశంలో పరిస్థితి అదుపులో ఉంచేందుకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిన్న దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ ఆంక్షలు డిసెంబరు 1 వరకు అమల్లో ఉంటాయని ఆదేశాలు జరీ చేసారు. ఈ విషయం పై ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మొదలైందని, ఇది మొదటి దశ కంటే మరింత ప్రమాదకరంగా ఉంటుందని, కాబట్టి అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా నేటి రాత్రి నుంచి అత్యవసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివేయాలని, ప్రజలు ఇళ్ల నుండి బయటకు అడుగుపెట్టాలంటే సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా రాతపూర్వక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మరింత జాగ్రత్త పడకుంటే 4 లక్షలకు పైగా మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. నవంబర్ నెల 15 నాటికి దాదాపు 9 వేల మందికి ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని అయన పేర్కొన్నారు.

 

రాజధాని పారిస్ సహా మరి కొన్ని ప్రధాన పట్టణాల్లో రెండో దశ ప్రారంభం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో రెండు వారాల క్రితమే కర్ఫ్యూ విధించినా సెకెండ్ వేవ్‌ను కట్టడి చేయలేకపోయామని మాక్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటికే 35 వేలకు పైగా మరణాలు కూడా నమోదైనట్టు చెప్పారు. అయితే వచ్చే రెండు వారాల్లో మహమ్మారి వ్యాప్తి నెమ్మదిస్తే సడలింపులు ఇస్తామని మాక్రాన్ స్పష్టం చేశారు.