తెలుగు రాష్ట్రాలలో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు హెల్త్ వర్కర్లకు అస్వస్థత
posted on Jan 16, 2021 5:20PM
ప్రధాని మోడీ ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రోగ్రాం రెండు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్ తో సైడ్ ఎఫెక్ట్ లు తప్పవని అందరు భావించినప్పటికీ అది అబద్ధమని రుజువు అయ్యింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారంతా క్షేమంగానే ఉన్నారు. ఏపీలోని విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న రాధ అనే హెల్త్ వర్కర్ స్వల్ప అస్వస్థకు గురైనప్పటికీ.. ఆమె ఈరోజు ఉదయం నుండి ఏమీ తినకపోవటంతో పాటు వ్యాక్సిన్ అంటే ఉన్న భయంతోనే ఆమెకు కళ్లు తిరిగినట్లు వైద్యులు తేల్చారు. ఆమె ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు.
మరోపక్క తెలంగాణాలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం సజావుగా సాగుతోంది. అయితే సంగారెడ్డి జిల్లాలోని ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్ అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న ఏఎన్ఎం సంగీతకు స్వల్ప అస్వస్థత కలిగింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే తనకు తల తిప్పుతుందని ఆమె వైద్యులకు తెలిపింది. ఆ తర్వాత ఆమె వాంతులు చేసుకోవడంతో వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. అయితే, కొన్ని లక్షల్లో ఒకరికి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు కనపడతాయని… భయపడాల్సిన పనిలేదంటున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.