గాలి ద్వారా వ్యాప్తి.. ప్రాణాలకు భద్రత లేని వైనం
posted on Jul 9, 2020 10:50AM
- ఎవరు పాజిటివ్, ఎవరు నెగిటివ్
- అదనంగా మాస్కో ఒకటే
- అంతా సేమ్ టు సేమ్
- నగరంలో గుంపులుగా తిరుగుతున్న ప్రజలు
- గాడి తప్పిన వైద్యం
- చేతులెత్తేసిన ప్రభుత్వం
- ప్రాణాలకు భద్రత లేని వైనం
- గాలి ద్వారా వ్యాప్తిపై తాజాగా డబ్ల్యూహెచ్వో ప్రకటన
ఇప్పటివరకు కోవిద్ వైరస్ సోకిన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు పడితేనే ఈ వైరస్ మరొకరికి సోకుతుంది అనుకునేవారు. అయితే తాజాగా డబ్ల్యూహెచ్వో గాలిలో ద్వారా వైరస్ వ్యాప్తి చెందవచ్చు అని స్పష్టం చేసింది. ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో హైదరాబాదులో మాత్రం రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో ఉంది. పరీక్షలు నిర్వహిస్తే ఈ సంఖ్య లక్షల్లోకి చేరినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
ప్రపంచంలో కరోనాతో బాధపడుతున్న దేశాల్లో మన దేశం మూడో స్థానానికి చేరింది. ఇక రాష్ట్రాల విషయానికొస్తే పరీక్షలు నిర్వహిస్తే మన దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ కేసులు మన రాష్ట్రంలోనే ఉంటాయేమో. వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ కేసులు వేల సంఖ్యలోనే నమోదు అవుతున్నాయి. మరి పరీక్షలు లక్షల్లో నిర్వహిస్తే అన్న ప్రశ్న ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తుంది. ఈ లెక్కలు చూస్తే ప్రస్తుత నగర జనాభాలో లక్షల్లో రోగుల సంఖ్య ఉండే ప్రమాదం ఉంది. మంచి ఆహారం తీసుకుంటూ పదిహేను రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండి ఆరోగ్య సూత్రాలను పాటిస్తే కోలుకోవచ్చు. కానీ ఎవరూ పాజిటివ్, ఎవరూ నెగిటివ్ తెలియని పరిస్థితిలో ప్రజలంతా అయోమయంలో ఉన్నారు. పరిస్థితి భయంకరంగా ఉన్న మాస్కులు ధరించకుండా ఇంటి నుంచి బయటకు వస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంది. వారి మీద కేసులు నమోదు చేసినప్పటికీ ఫలితం మాత్రం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.