TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప‌బ్‌పై రైడ్స్.. 'అన్‌ ప్రొఫెషనల్‌' పోలీసింగ్ అంటూ విమ‌ర్శ‌లు!

Published on: Mon Apr 4, 2022 12:12PM

ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి. కింద‌ప‌డేసిన డ్ర‌గ్స్ ప్యాకెట్స్ సీజ్‌. 148మంది పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లింపు. క‌స్ట‌డీలో ఐదుగురు. ప‌బ్‌లో ప్ర‌ముఖుల పిల్ల‌లు. డ్ర‌గ్స్ పార్టీపై రాజ‌కీయ విమ‌ర్శ‌లు. రాడిస‌న్ బ్లూ హోట‌ల్ ప‌బ్‌ య‌వ్వారం తీవ్ర ప్ర‌కంప‌ణ‌లు రేపుతోంది. డ్ర‌గ్స్ దందాకు కేసీఆర్‌ఱ స‌ర్కారు వైఫ‌ల్య‌మే కార‌ణ‌మంటూ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప‌బ్‌కు వెళ్ల‌డం త‌ప్పు ఎలా అవుతుంది?  డ్ర‌గ్స్ తీసుకుంటే నేరం అవుతుంది కానీ.. అంటూ పోలీసుల తీరుపై ఆగ్ర‌హ జ్వాల‌లు. చేయ‌ని త‌ప్పుకు మా ప‌రువు తీశారంటూ, హైద‌రాబాద్ అంటే ఇలా ఉంటుందా? ఇక్క‌డి పోలీస్ సిస్ట‌మ్ ఇంత దారుణ‌మా అంటూ విదేశీ క‌స్ట‌మ‌ర్ల చీప్ కామెంట్లు క‌ల‌క‌లం రేపుతోంది. ఓవైపు డ్ర‌గ్స్ దొర‌క‌డం ఎంత సంచ‌ల‌నంగా మారిందో.. ప‌బ్ క‌స్ట‌మ‌ర్ల‌పై పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు సైతం అంతే వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. 

అది 5 స్టార్‌ హోట‌ల్‌. 24/7 ప‌బ్ న‌డుపుకునేందుకు ప‌ర్మిష‌న్ ఉంది. అలా రాత్రంతా ప‌బ్ న‌డుపుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది తెలంగాణ స‌ర్కారే. సో.. మిడ్‌నైట్ ప‌బ్ నిర్వ‌హించ‌డం టెక్నిక‌ల్‌గా త‌ప్పే కాదంటున్నారు. చ‌ట్ట ప్ర‌కార‌మే ప‌బ్ న‌డుస్తోంది కాబ‌ట్టి.. అందులో లేట్‌నైట్ పార్టీల‌కు అటెండ్ అవ‌డం క‌స్ట‌మ‌ర్ల నేరం కూడా కాదు. అది వారిష్టం. కాక‌పోతే డ్ర‌గ్స్ తీసుకోవ‌డం మాత్రం ముమ్మాటికీ నేర‌మే. మ‌రి, ఆ టైమ్‌లో, ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌లో 150 మందికి పైగా క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు. వారిలో ఏ ప‌ది మందో డ్ర‌గ్స్ తీసుకొని ఉంటారు. మ‌రి, మిగ‌తా 140 మందికి శిక్ష ఎందుకు?  వారి ఇమేజ్‌తో చెల‌గాట‌మెందుకు? అనే చ‌ర్చ న‌డుస్తోంది. పోలీసులు ఆ ఆపరేషన్‌కు ముందు ఎలాంటి కసరత్తు చేయలేదని, ప్లానింగ్ స‌రిగా లేద‌ని, బ్యాకప్‌ ప్రోగ్రామ్‌ ఏమిటనే ప్రణాళిక లేకుండా.. ఇష్టారాజ్యంగా ప‌బ్‌ క‌స్ట‌మ‌ర్ల‌ను పోలీస్ స్టేష‌న్‌కు తరలించారని చెబుతున్నారు. ఐదుగురు విదేశీ మహిళలైతే ఇది ‘అన్‌ ప్రొఫెషనల్‌’ పోలీసింగ్‌ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని స‌మాచారం.

మెగా డాట‌ర్ నిహారిక‌. సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌. గ‌ల్లా సిద్ధార్థ్‌. ఇలా చాలా మంది ప్ర‌ముఖులు ఉన్నారు. వారెవ‌రూ తాము డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని వాదిస్తున్నారు. కావాలంటే బ్ల‌డ్ శాంపిల్స్ ఇస్తాం.. టెస్ట్ చేసుకోండ‌ని స‌వాల్ కూడా చేశారు. అయినా, పోలీసులు అలాంటి 150 మందిని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఉద‌యం వ‌ర‌కూ పీఎస్‌లోనే కూర్చోబెట్టారు. వారి పేర్ల‌ను మీడియాకు లీకులిచ్చారు. ప‌రోక్షంగా వారి ప‌ర‌వుంతా పోయేందుకు కార‌ణ‌మ‌య్యారు. తాము జ‌స్ట్ క‌స్ట‌మ‌ర్స్ మాత్ర‌మేన‌ని.. స‌ర‌దాగా ప‌బ్‌కు వ‌చ్చామ‌ని.. త‌మ‌కు డ్ర‌గ్స్‌తో ఎలాంటి సంబంధం లేకున్నా.. త‌మ‌ను గంట‌ల త‌ర‌బ‌డి పోలీస్ స్టేష‌న్లో కూర్చోబెట్ట‌డం.. మాన‌సికంగా వేధించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. అలా క్వ‌శ్చ‌న్ చేసినందుకు పోలీసులు త‌మ‌తో రూడ్‌గా బిహేవ్ చేశార‌ని అంటున్నారు. 

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వ్యవహరించిన తీరు సరైందేనా? డ్రగ్స్‌ ఉన్నాయా? లేదా? చూడకుండా 148 మందిని అదుపులోకి తీసుకోవడం.. వారిని పోలీసు ఠాణాకు తరలించడం.. ఏడుగంటల పాటు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేయడం.. ఆ తర్వాత వదిలేయడం..! ఇదంతా సమంజసమేనా? అంటున్నారు. డ్రగ్స్‌పై దాడులు సరైనవేనని కానీ, ఏ పాపం తెలియని వారిని ఇబ్బందులకు గురిచేయడం దారుణమని పలువురు బాధితులు వాపోయారు. 

పోలీస్‌స్టేషన్‌లో మహిళల పట్ల ఒకరిద్దరు కానిస్టేబుళ్లు దురుసుగా వ్యవహరించారని.. నోటితో చెప్పలేని విధంగా ఓ యువతిని తిట్టారని ఓ మహిళ వివరించారు. ఏపీకి చెందిన ఓ విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి కూతురు ఇటీవలే అమెరికా నుంచి రాగా.. తన స్నేహితురాళ్లతో సరదాగా పబ్‌కు వచ్చారు. చేయని నేరానికి ఆ యువతి, ఆమె ఫ్రెండ్స్‌ను స్టేష‌న్లో కూర్చోబెట్టారని చెప్పారు. మ‌రోవైపు.. ‘ఐదారుగురు మాత్రమే ఎవ‌రిదో పుట్టిన రోజు వేడుక జరుపుకొన్నారు. మిగతా వారికి ఆ వేడుకతో సంబంధమే లేదని బాధితులు అంటున్నారు. 

తాము డ్రగ్స్‌ తీసుకోలేదని, బ్లడ్‌ టెస్ట్‌ చేసుకోవచ్చని చాలా మంది కోరారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. పై అధికారులు చెప్పేదాకా వెయిట్‌ చేయాలంటూ గంట‌ల త‌ర‌బ‌డి పీఎస్‌లోనే కూర్చోబెట్టారు. ఉదయం 7 గంటల నుంచి ఒక్కొక్కరి వివరాలు తీసుకుని, పంపించారు. ప‌బ్‌పై దాడి ఎపిసోడ్‌లో డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ‌టం ఎలా ఉన్నా.. ఇలా ప్లానింగ్ లేకుండా రైడ్స్ చేసి.. వంద‌ల మందిని తీవ్ర ఇబ్బందికి గురి చేయ‌డం దారుణ‌మ‌ని.. ఇదంతా అన్ ప్రొఫెష‌న‌ల్ పోలీసింగ్ అంటూ బాధితులు ఆరోపిస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.