జే బ్రాండ్లే కాదు.. మంచినీళ్లు, కొబ్బరినీళ్లూ హానికరమే.. నవ్విపోదురుగాక మాకేంటి!
Published on: Wed Mar 23, 2022 1:14PM
ప్రభుత్వం జె-బ్రాండ్లను బాగా వెనకేసుకొస్తోంది. ఆ క్రమంలో బాగా దిగజారిపోతోంది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ.. ఏపీలో అమ్ముడవుతున్న పలు బ్రాండ్లను ల్యాబ్లో టెస్ట్ చేయించి.. అందులో హానికర రసాయనాలు ఉన్నాయంటూ ఆ రిపోర్టులను రిలీజ్ చేశారు. దానిపై మీడియాలో చర్చ జరగడం, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ రిపోర్టులు జత చేసి స్పీకర్కు, మండలి ఛైర్మన్కు లేఖ రాయడంతో.. జగన్రెడ్డి సర్కారులో కలవరం మొదలైంది. అయినా, ఆందోళన ఉంటే గింటే మద్యం తయారీ చేసే కంపెనీలకు ఉండాలి కానీ, మధ్యలో ప్రభుత్వానికి, వైసీపీ పెద్దలకు ఎందుకంత ఉలిక్కిపాటు అనే డౌటు.
పై నుంచి ఏం ఒత్తిడి వచ్చిందో ఏమో.. ఆ మద్యం సరుకంతా సక్కనైనదే అని చెప్పేందుకు.. పాపం అధికారులు బాగానే ప్రయత్నించారు. ఆ క్రమంలో కాస్త ఓవరాక్షన్ కూడా చేశారు. టెస్టులు చేయిస్తే లిక్కర్లోనే కాదు.. మంచినీళ్లు, కొబ్బరి నీళ్లూ తాగేందుకు పనికి రావని చెప్పుకొచ్చారు గుంటూరులోని ప్రాంతీయ ఎక్సైజ్ ప్రయోగశాల కెమికల్ ఎగ్జామినర్ జూలియట్ షకీలాదేవి. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్భార్గవ, ఏపీఎస్బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డిల సమక్షంలో ఆమె జే బ్రాండ్లను సమర్థించే ప్రయత్నం చేశారు.
ఈ రచ్చ అంతటికీ కారణం రఘురామ కృష్ణంరాజే. ఆయన, ఏపీలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసిన మద్యం నమూనాల్ని చెన్నైలోని ఎస్జీఎస్ ప్రయోగశాలలో పరీక్షలు చేయిస్తే అందులో ప్రాణాంతక వొల్కొనిన్, స్కోపారోన్, పైరోగ్లాల్ వంటి ప్రాణాంతక పదార్థాలు ఉన్నాయంటూ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాయడంతో ఇంతటి హంగామా నెలకొంది. ఇప్పుడే కాదు గతంలోనూ రఘురామ ఇలానే చేశారు. జే బ్రాండ్ల బండారం ల్యాబ్ రిపోర్టులతో బట్టబయలు చేశారు. కట్ చేస్తే, ఏపీ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రజత్ భార్గవ.. టెస్టులు చేయించిన రఘురామపై కేసులు పెడతామని, పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
జే బ్రాండ్స్ మద్యమే కాదు మంచినీళ్లు, కొబ్బరినీళ్లు సైతం ప్రమాదకరమేనంటూ అధికారులు ఇంత అడ్డగోలుగా ఆ కంపెనీలను ఎందుకు వెనకేసుకొస్తుందో అనే అనుమానం రాకమానదు? వారి మాటలు వింటుంటే ఆ లిక్కర్ కంపెనీలు ప్రభుత్వ పెద్దలవే అనే ప్రచారం నిజమేనని అనిపిస్తోంది. ఆరోపణలు వస్తున్న మద్యం కంపెనీలకు నోటీసులు ఇవ్వడమో, చర్యలు తీసుకోవడమో చేయొచ్చుగా? లేదంటే, ఆ ప్రభుత్వమే స్వయంగా ఆ మద్యాన్ని టెస్టు చేయించొచ్చుగా? అంతగా వెనకేసుకు రావడం ఎందుకు?


