TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెండేళ్లలో 5వేల ఆలయాల నిర్మాణం.. దేవాదాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం

Published on: Fri Apr 17, 2026 10:39AM

శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లల్లో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సూచించారు.   రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు గురువారం (ఏప్రిల్ 16) సమీక్షించారు. ఈ సందర్భంగా  శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించామనీ,  ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజ కవర్గంలోనూ పాతిక నుంచి 30  ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుందన్న ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. 

 రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలన్నారు. ఇప్పటి వరకు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయని చెప్పిన ఆయన ఈ మాస్టర్ ప్లాన్ ల ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, నివాస సౌకర్యాలు, పరిశుభ్రత వంటి అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దేవాలయాల్లో పవిత్రతో పాటు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమివ్వాలన్నారు.   

  రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.   రాష్ట్రంలో ఆధ్యాత్మిక టూరిజం ప్రమోట్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్న చంద్రబాబు.. అన్ని దేవాలయాల వద్ద వసతి సౌకర్యాలు మెరుగు పరచాలని చెప్పారు.  ఇందుకోసం టెంపుల్ టౌన్ డెవలప్‌మెంట్ ప్లాన్ సిద్దం చేయాలని ఆదేశించారు.  ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.