TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సభలో రాజ్యాంగ సవరణ బిల్లు.. విపక్షాల నిరసన

Published on: Thu Apr 16, 2026 10:38AM

దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికే మూడు అత్యంత కీలకమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం గురువారం (ఏప్రిల్ 16) లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రధానంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఏకపక్షంగా ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశపెట్టిందని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.  

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు.  నారీ శక్తి వందన్ అధినియమ్  ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.   2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.

ఈ ప్రతిపాదనలో భాగంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి   850కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.   మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదనీ, కానీ   డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రను సహించబోమని చెబుతున్నాయి. 

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన చేపడితే, కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతో రాజకీయ గిమ్మిక్కులకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఇలా ఉండగా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాలంటే.. సభలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే లోక్ షభలో కనీసం 360 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ఎన్డీయే కూటమికి సభలో ఉన్న బలం 292 మాత్రమే కావడంతో ఈ బిల్లు ఆమోదం పొందడం సులభ సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.