TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ జూమ్ సమావేశం

Published on: Sun Jun 14, 2026 5:40PM

 

ఓటర్ మ్యాపింగ్, ఓటర్ల జాబితా పరిశీలన, బీఎల్ఏల బాధ్యతలపై కాంగ్రెస్ నాయకత్వం విస్తృతంగా చర్చించింది. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ సమావేశాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.

మూడు పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా తీసుకుని అరగంట చొప్పున మొత్తం ఆరు జూమ్ సమావేశాలు నిర్వహించారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, బీఎల్ఏలు చేపట్టాల్సిన చర్యలు, బీఎల్‌ఓల పనితీరుపై నిఘా, ఓటర్ల జాబితాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకత్వం దిశానిర్దేశం చేసింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంత శాతం ఓటర్ మ్యాపింగ్ పూర్తైందనే అంశాన్ని సమీక్షించారు. ఇంకా మ్యాపింగ్‌లో చేరని, ఓటు హక్కు కోల్పోయిన అర్హులను గుర్తించి వారికి తిరిగి ఓటు హక్కు కల్పించే విధానంపై వివరించారు.

ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. సీఈఆర్ పేరుతో ఓట్ల పరిశీలన చేపట్టి కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్ఏలు ఓటర్ మ్యాపింగ్‌ను లోతుగా పరిశీలించి ప్రతి అర్హ ఓటును కాపాడాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఓటు తొలగింపునకు గురైతే వెంటనే ఆధారాలతో తిరిగి దరఖాస్తు చేసి పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రతి ఓటు కీలకమని, ఒక్క ఓటు కూడా కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాయకత్వం స్పష్టం చేసింది.

ఈ జూమ్ సమావేశాలకు గంప వేణుగోపాల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించగా, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన అంశాలను టీపీసీసీ ఎలెక్షన్ కమిషన్ చైర్మన్ రాజేష్ వివరించారు.

ఇప్పటివరకు సుమారు 90 శాతం బీఎల్ఏ శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి బీఎల్ఏ-2 ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో ఓటర్ ధృవీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ప్రతి 10 బూత్‌లకు ఒక సూపర్‌వైజర్‌ను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్‌ను నియమిస్తూ, ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓలతో సమన్వయం ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, ట్రైనింగ్ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.