కాంగ్రెస్, వైసీపీల వికృత క్రీడ
posted on Aug 27, 2013 12:49PM
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని పార్టీలు ప్రజలను మరింత రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ ఈ వికృత క్రీడలో భాగస్వాములు కావడం దురదృష్టకరమని, ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిస్తున్నాయని అన్నారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు తమకు తోచిన విధంగా శాంతియుత ఉద్యమాలు చేసుకోవచ్చు. అలాంట ప్పుడు ఇతరులు వారి కార్యక్రమాలను అడ్డుకోవడం, రెచ్చగొట్టేలా వ్యవహరించడం, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం మంచిదికాదని సూచించారు.
సున్నితమైన తెలంగాణ అంశాన్ని సమగ్ర రీతిలో పరిష్కరించాల్సిన కాంగ్రెస్, రాజకీయ ప్రయోజనాల కోసం జటిలంచేసి ప్రజలమధ్య చిచ్చు పెట్టిందన్నారు. తాంబూలాలిచ్చాం... తన్నుకు చావండన్న రీతిలో కాంగ్రెస్ నేతలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏడు రోజులుగా వివిధ వర్గాల ప్రజలు ఆందోళనచేస్తున్నా వారిని శాంతింపజేసే ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకపోవడం గర్హనీయమన్నారు.