మోడీ పనితీరు అద్భుతం: కాంగ్రెస్ నేతలు

 

భారత ప్రధాని నరేంద్రమోడీ తన రాజకీయ ప్రత్యర్థులతో కూడా శభాష్ అనిపించుకున్నారు. ఎన్నడూ ఎవరినీ పొగిడి ఎరుగని కాంగ్రెస్ నాయకులకు కూడా మోడీని ప్రశంసించక తప్పలేదు. ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరో కాదు... దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్. జమ్ము - కాశ్మీర్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. వరద బాధితులను ఆదుకోవడానికి మోడీ స్పందించిన తీరు అందరికీ నచ్చింది. అందరితోపాటు కాంగ్రెస్ నాయకులకు కూడా నచ్చడమే వింత. కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ ఆయనను ప్రశంసించారు. జమ్మూ కాశ్మీర్ వరదలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించిన తీరు అద్బుతమని కొనియాడారు. జమ్ము కాశ్మీర్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడంతో పాటు, ఆర్థిక సాయంగా వెయ్యి కోట్లు ప్రకటించడం,భద్రతా దళాలను సహాయక చర్యల్లో దించడం లాంటి చర్యలతో మోడీ పనితీరు బాగుందని వారు పేర్కొన్నారు.