కేసీఆర్ కి దమ్ముంటే ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలి

 

కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ మళ్లీ అబద్దాలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. నిన్నటి వరకు ఫెడరల్‌ ఫ్రంటన్న కేసీఆర్‌.. ఇప్పుడు జాతీయపార్టీ అంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ 16 మంది ఎంపీలు గెలిచి ప్రధాని మోదీ ప్రేమను పొందాడు కానీ రాష్ట్రానికి ఏమీ తేలేదని విమర్శించారు. కేసీఆర్‌ ఇక్కడ బీజేపీని తిట్టి ఢిల్లీ వెళ్లి మోదీ కాళ్లు మొక్కుతారన్నారు. విభజన హామీలు సాధించలేని కేసీఆర్‌కు మళ్లీ ఓటు వేయాలా?, అబద్దాల కేసీఆర్‌.. దేశానికి ప్రధానినా? అని ప్రశ్నించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇచ్చి కొంటున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులు చేసే వ్యక్తి ప్రధాని అయితే.. దేశం ఏం కావాలని ప్రశ్నించారు. మా పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కున్నారు కదా.. మీకు ప్రజల అండ ఉందొ లేదో తెలుస్తుంది. దమ్ముంటే ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని కేసీఆర్ కి షబ్బీర్ అలీ సవాల్ విసిరారు.